ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు... ప్రకాశం జిల్లాలో గుర్తింపు
చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 13 నమోదు కాగా , తాజాగా ఇప్పుడు ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసులు రెండుకు చేరాయి . దీంతో ఏపీ వాసులు భయపడుతున్నారు. దేశ వ్యాప్తంగా కరోనాను నియంత్రించటం కోసం కేంద్ర రాద్త్ర ప్రభుత్వాలు హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించి కరోనా నివారణకు కష్టపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా కేసు నెల్లూరు జిల్లాలో నమోదు కాగా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మరో కేసు నమోదైంది. ఇప్పటికే తెలంగాణలో ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 13కు చేరగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్లో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.
ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేల్చారు వైద్యులు . ఇక లండన్ నుంచి వచ్చిన యువకుడికి ప్రస్తుతం ఒంగోలు రిమ్స్లో చికిత్స అందిస్తున్నారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి సదరు వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు.
ఇక ఇదే అమయంలో కరోనా అనుమానితులు కూడా పెరుగుతున్నారు. అటు మంగళగిరిలో ఓ యువతికి కరోనా లక్షణాలు ఉండటంతో గుంటూరులోని ఐడీ ఆసుపత్రికి తరలించారు. అటు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించింది. కేవలం స్కూళ్లు, కళాశాలలే కాకుండా.. యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లకు కూడా సెలవులు ప్రకటించిన సర్కార్ కరోనా నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మరోవైపు కరోనా ఎఫెక్ట్తో స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి .