టీడిపీలో భయపెడుతున్న రెండవ స్థానం..! పార్టీలో అత్యంత ప్రమాదకర ప్రస్థానం..!!
అమరావతి/హైదరాబాద్ : టీడీపీ ఆవిర్బావం నుండి ఓ సెంటిమెంట్ ఆ పార్టీని నీడలా వెంటాడుతోంది. ఎవరైతే పార్టీలో నెంబర్ టూగా ఉంటారో వారి రాజకీయ భవిష్యత్తు శూన్యంలోకి పడిపోతుంది. అందుకు పలు ఉదాహరణలు ఉన్నాయని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. పార్టీ ఆరంభం నుంచి ఇప్పటి వరకూ ఎవరైతే నెంబర్ టూ స్థానం చెలాయించారో వారందరి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరమయ్యే సాంప్రదాయం పార్టీని వెంటాడింది. 2019 తాజా ఎన్నికల్లోనూ ఇది రుజువయ్యింది. ఈ ఎన్నికల్లో లోకేష్ ఓటమి కూడా ఈ కోవలోకే చెందిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
టీడిపిలో కలిసి రాని రెండో స్థానం..! కనుమరుగవుతున్న నేతలు..!!
ముఖ్యంగా పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత మంత్రిగా లోకేష్ అన్నిరకాలుగా నెంబర్ టూ స్థానంలో కొనసాగుతున్నాడు. పార్టీ నిర్ణయాల్లోనూ, ప్రభుత్వ పరమైన నిర్ణయాల్లోనూ చంద్రబాబు తర్వాత లోకేష్ నిర్ణయమే టీడీపీలో వేదంగా నడిచింది. అయితే నెంబర్ టూ స్థానంలో ఉన్న శని కారణంగానే లోకేష్ తొలిసారి పోటీలోనే అనూహ్యంగా ఓటమి చెందారని పార్టీవర్గాల్లో టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇదంతా కొట్టి పారేసేవారికి గతంలో జరిగిన సంఘటనలనే సాక్ష్యాలుగా చెబుతున్నారు.
పార్టీ ఆవిర్బావం నుంచి అదే వరస..! రెండవ స్థానంలో ఉంటే ఇక అంధకారమే..!!
ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం సమయంలో ఎన్టీఆర్ నెంబర్ వన్ స్థానంలో ఉండేవారు, అయితే పార్టీ పరంగానూ, ప్రభుత్వపరమైన నిర్ణయాల్లో అప్పటి మంత్రి నాదెండ్ల భాస్కర్ రావు నెంబర్ టూగా చెలామణి అయ్యారు. అయితే నాదెండ్ల తిరుగుబాటు తనదనంతర పరిణామాల తర్వాత ఆయన పెద్దగా రాజకీయాల్లో కనిపించలేదు. దాదాపు ఆయన రాజకీయ జీవితం శూన్యమైపోయందనే చెప్పాలి.
ఎంతో మంది మాయం..! అదీ రెండో స్థానం మహిమ..!!
ఆ తర్వాత పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ వ్యవహరించారు. ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణే అన్ని రకాలుగా వారసుడు అవుతాడని అంతా భావించారు. ఎన్టీఆర్ కూడా తన వారుసుడు హరికృష్ణ అయితేనే బావుంటుందని భావించారు. అయితే ఆతర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో హరికృష్ణ ఏకంగా రాజకీయాలకు దూరమైపోయారు. పార్టీలో కూడా పూర్తి ప్రాధాన్యతను కోల్పోయారు.
లోకేష్ కు కూడా చేదు అనుభవం..! ఘోర పరాభవాన్ని చవి చూసిన యువ నేత..!!
అలాగే ఎన్టీఆర్ హయాంలోనే ఆయన సతీమణిగా వచ్చిన లక్ష్మీపార్వతి సైతం పార్టీలో నెంబర్ టూగా అనధికారికంగా చెలామణి అయ్యారు. ఎన్టీఆర్ తదనంతరం జరిగిన పరిణామాల్లో ఆవిడ రాజకీయ భవిష్యత్తు సైతం అగమ్యగోచరమైంది. అనంతరం చంద్రబాబు హయాంలో సైతం అప్పటి హోం మంత్రి దేవేందర్ గౌడ్ ను అంతా నెంబర్ టూగా భావించారు. ప్రస్తుతం ఆయన కూడా క్రియాశీల రాజకీయాల నుంచి దాదాపు తప్పుకున్నట్లే. ఇలా పార్టీలో ఎవరైతే నెంబర్ టూ స్థానుంలో చెలామణి అయ్యారో వారి రాజకీయ జీవితాలు కనుమరుగై పోయాయి. తాజాగా నారా లోకేష్ సైతం మంగళగిరిలో భారీ ఓటమి చవిచూడటంతో ఈ సెంటిమెంట్ కు మరింత బలం చేకూరింది.