రాజధాని గ్రామాల్ని కదలనివ్వం: నారాయణ, అమరావతితో భూమి ధర పెరిగింది: బాబు
విజయవాడ: ప్రధాన రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలతో గ్రామాలు పోతాయన్న వార్తలు కేవలం అపోహనేనని, గ్రామ కంఠాలను ఎట్టి పరిస్థితుల్లోను కదలనివ్వమని మంత్రి పి నారాయణ సోమవారం నాడు చెప్పారు. రోడ్ల కారణంగా గ్రామాలు పోతాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.
గ్రామ కంఠాలను ఎట్టి పరిస్థితుల్లోను కదిలించేది లేదని స్పష్టం చేశారు. 29 గ్రామాల మధ్య తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని గ్రామాల అభివృద్ధిని సమీక్షించేందుకు ఇది ఉపయుక్తంగా ఉంటుందన్నారు. భూసార పరీక్షల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
మాస్టర్ బ్లాన్ ముసాయిదా మాత్రమేనని, సూచనలు, సలహాలు ఇవ్వాలనుకునే వారు ఇవ్వవచ్చునని చెప్పారు. మాస్టర్ ప్లాన్ సిద్ధం కాగానే ల్యాండ్ పాలసీ ఉంటుందన్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే సంస్థలకు భూములు కేటాయిస్తామని చెప్పారు.
రాజధాని నిర్మాణంతో భూముల విలువ పెరిగింది: చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణం నేపథ్యంలో భూముల విలువ పెరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీని ఆయన సందర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచస్థాయి నగరంగా అమరావతి తీర్చిదిద్దుతామన్నారు.
వ్యవసాయరంగంతో పాటు పాల ఉత్పత్తి ద్వారా ఏపీకి ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. వ్యవసాయం చేసే రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ, పాల ఉత్పత్తితో నష్టపోయిన సందర్భాలు లేవన్నారు. వ్యాపార రంగంలోనూ మహిళలు రాణించాలన్నారు.
సంగం డెయిరీపై చంద్రబాబు ప్రశంసలు
వడ్లమూడి సంగం డెయిరీలో దూళిపాళ్ల వీరయ్య చౌదరి కల్చర్డ్ భవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగం డెయిరీ పైన చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. నాడు వీరయ్య చౌదరి దూరదృష్టితో వేసిన సంగం డెయిరీ విత్తనం నేడు మహా వృక్షంలా మారిందన్నరు. దూళిపాళ్ల నరేంద్ర పైన వారసత్వ బాధ్యత ఉందన్నారు. సంగం డెయిరీ టర్నోవర్ పెరగడం నరేంద్ర ప్రతిభకు నిదర్శనం అన్నారు.