అంతర్వేదిలో కొనసాగుతున్న 144 సెక్షన్: అడుగడుగునా పోలీసుల పహారా..రీజన్ ఇదే !!
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో రథం అగ్నికి ఆహుతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రగిలిపోతోంది. మత ఘర్షణలు చెలరేగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆలయంలో రథం ధ్వంసం సంఘటనపై హిందూ సంఘాలు మండి పడుతున్న పరిస్థితి ఉంది. ఇక ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే, ప్రభుత్వ అసమర్థత వల్లే ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. దీంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అంతర్వేదిలో 144సెక్షన్ విధించారు.
అంతర్వేదిలో పరిస్థితి చెయ్యి దాటిపోకుండా 144 సెక్షన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని మండిపడుతున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు తిప్పికొడుతూ ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు చేయాలని విచారణ జరిపించేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్. అంతేకాదు అంతర్వేది లో రథం సంఘటన వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అంతర్వేదిలో పరిస్థితులు చేయి దాటి పోకుండా ఉండేందుకు 144 సెక్షన్ విధించారు.
ఆలయ పరిసరాల్లోకి ఎవరూ రావద్దని హెచ్చరిక
ఆలయ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులు జనాలు గుంపులుగా లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు అంతర్వేది ఆలయ పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పోలీస్ యాక్ట్ 30 తోపాటుగా సెక్షన్ 144 అమలు చేస్తున్న పోలీసులు ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని చెప్పారు. మరోవైపు ఈ ఘటనకు నిరసనగా రాజోలులో వర్తకులు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. రథం దగ్ధం ఘటనపై ఆర్డిఓ , కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి జనసేన నిరసనలకు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు ఆందోళనలకు అనుమతి లేదని చెప్తున్నారు.
రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం ..నివురుగప్పిన నిప్పులా అంతర్వేది
అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ రథం దగ్ధమైన తరువాత ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమించినప్పటికీ హిందూ సంఘాలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి తెలిసిందే. ఇక బీజేపీ , జనసేన , టీడీపీ నేతలు సైతం అంతర్వేది ఘటనపై భగ్గుమన్నారు . రెండు రోజుల క్రితం ఆలయ రథం దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్లిన మంత్రులను ధార్మిక సంఘాలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ లను అడ్డుకుని వారితో వాగ్వాదానికి దిగారు హిందూ సంఘాలు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఉద్రిక్తతను తగ్గించారు. కానీ నివురుగప్పిన నిప్పులా అంతర్వేది పరిస్థితి ఉందని సమాచారం .
Recommended Video
నేడు ఎంపీ రఘురామ దీక్ష .. అంతర్వేదిలో అడుగడుగునా పహారా
ఈ నేపథ్యంలోనే అంతర్వేది కి వెళ్లాలని ప్రయత్నించిన ఇతర పార్టీల నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. అయినా వారంతా నిరసన దీక్షలను కొనసాగించారు. ఎప్పుడు ఎం జరుగుతుందో అర్ధం కాని స్థితిలో ప్రస్తుతం అంతర్వేదిలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేడు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దేవాలయాల పరిరక్షణ కోసం 8 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఏది ఏమైనా ఏపీలో ఇంకా అంతర్వేది ఘటనపై ఉద్రిక్తతలు చల్లారని కారణంగానే 144 సెక్షన్ విధించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
అడుగడుగునా పహారా కాస్తున్నారు .