టెన్షన్..టెన్షన్: రాజధాని గ్రామాల్లో పోలీసు బలగాలు: టియర్ గ్యాస్.. వాటర్ క్యాన్ మొహరింపు..!
ఒక వైపు సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం. ఆ సమావేశంలో తీసుకొనే నిర్ణయం పైన పక్కనే ఆందోళనలు. భారీగా పోలీసు బలగాల మొహరింపు. ఎప్పుడూ లేని విధంగా రాజధాని గ్రామాల్లో పోలీసుల కవాతు. అన్ని గ్రామాల్లో 144 సెక్షన్. ముందు జాగ్రత్తగా ప్రతీ గ్రామంలో పోలీసు పికెట్లు. మందడం నుండి సచివాలయం వెళ్లే దారిలో ఆంక్షలు. రాజధాని గ్రామాల్లో మొహరించిన టియర్ గ్యాస్.. వాటర్ క్యాన్.. అగ్నిమాపక దళాలు. మండదంలో నిరసనలకు అనుమతి నిరాకరణ.
తుళ్లూరులో షరతులతో కూడిన అనుమతి. శాంతియుత నిరసనకు మాత్రమే అనుమతి ఇచ్చామని..ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరికలు. ఇదే సమయంలో సీఎం..మంత్రులు సచివాలయానికి రాక..అదే విధంగా తిరిగి వెళ్లే వరకు పోలీసుల్లో టెన్షన్. నిర్ణయం ఏ రకంగా ఉంటుందో అంటూ రైతుల్లో టెన్షన్. దీంతో.. అమరావతి ప్రాంతంలో మొత్తంగా ఎక్కడ చూసినా టెన్షన్..టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్
రాజధాని మార్పు ప్రతిపాదనలు..నిర్ణయం రూపంలో తీసుకొస్తున్న వేళ అమరావతి గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. స్థానికులు..రైతులు ఈ ప్రతిపాదనలను నిరసిస్తూ 10 రోజులుగా ఆందోళన లు చేస్తున్నారు. వీరికి పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇక, ఈ రోజు కేబినెట్ సమావేశం జరగనుండటంతో..పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రతీ గ్రామ సరిహద్దుల్లో ముల్లకంచెలు ఏర్పాటు చేసారు. మందడంలో ఈ రోజు నిరసనలకు అనుమతి ఇవ్వకుండా అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. తుళ్లూరు ప్రాంతంలో మాత్రం శాంతి యుత నిరసనకు అనుమతి ఇచ్చారు. దాదాపు 700 మంది పోలీసులు తుళ్లూరు నుండి సచివాలయం ప్రాంతం వరకు మొహరించారు. ప్రతీ ఒక్కరినీ నిశితంగా పరిశీలిస్తున్నారు. సచివాలయం రోడ్డు మొత్తం పోలీసుల నియంత్రణలో ఉంది.
టియర్ గ్యాస్.. వాటర్ క్యాన్..
కేబినెట్ సమావేశం జరిగే సచివాలయం చుట్టుపక్కల పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుపాకులు, లాఠీలతో బస్సుల్లో పెద్ద ఎత్తున్న పోలీసు బలగాలు దిగాయి. ఏపీ సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్ గ్యాస్.. వాటర్ క్యాన్.. అగ్నిమాపక దళాలు మోహరించాయి. గ్రామాల్లో యద్ధ వాతావరణాన్ని సృష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాజధాని రైతులు పేర్కొంటున్నారు. సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో మందడం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు పదోరోజూ రహదారిపై మహాధర్నా నిర్వహించా లని రైతులు నిర్ణయించారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో శుక్రవారం కూడా రిలే నిరాహార దిక్షలు కొనసాగించనున్నారు. ఉద్దండరాయినిపాలెం శంకుస్థాపన ప్రదేశంలో ఉదయం నుంచి రైతులు నిరసన తెలపనున్నారు.
కేబినెట్ ముగిసే వరకూ టెన్షన్
ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో..సచివాలయంకు ముఖ్యమంత్రి..మంత్రులు చేరుకొనే వరకూ పోలీసులు కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. వారి రాక పోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. ముందస్తుగా పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు. జీఎన్ రావు కమిటీ సభ్యులు సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి తిరిగి వెళ్తున్న వేళ ఆ ప్రాంతంలోని స్థానికులు పెద్ద ఎత్తున వారిని అడ్డుకొని..నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో..కేబినెట్ సమావేశం సమయంలోనూ ఇటువంటివి చోటు చేసుకొనే అవకాశం ఉండటంతో ముందుగానే ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే, కేబినెట్ సమావేశం తరువాత కూడా పోలీసు బలగాలను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ లో తీసుకొనే నిర్ణయాలకు అనుగుణంగా రాజధాని రైతులు..రాజకీయ పార్టీలు తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.