పరిటాల సునీత కుటుంబానికి భద్రత పెంపు
అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. ఇప్పుడున్న గన్మెన్ల సంఖ్యను పెంచింది. అదనంగా ఎనిమిది గన్మెన్లను నియమిస్తూ కర్నూలు రేంజీ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త ప్రభుత్వంలో తమ కుటుంబ భద్రతపై పరిటాల సునీత సందేహాలను వ్యక్తం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం.
అంతకుముందు పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరాములు అనంతపురం జిల్లాలోని స్వగ్రామం వెంకటాపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ కుటుంబ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు దాడులు చేయొచ్చని ఆమె అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవలసిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
గ్రామాల్లో గొడవలు సృష్టించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. సంయమనం పాటించాలని చెప్పారు. తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. గొడవలకు దిగ వద్దని కార్యకర్తలు, అనుచరులకు సూచించారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు దిగుతున్నారని అన్నారు. ఇళ్లపై దాడులు చేస్తున్నారని అన్నారు.
మొన్నటి ఎన్నికల్లో పరిటాల సునీత పోటీ చేయలేదు. తనకు బదులుగా తన కుమారుడిని బరిలో దింపారు. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రీరాములు పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సుమారు 40 వేలకు పైగా ఓట్ల తేడాతో శ్రీరాములుపై గెలిచారు.
ఎన్నికలు ముగిసిన తరువాత తొలిసారిగా పరిటాల సునీత, శ్రీరాములు స్వగ్రామం వెంకటాపురానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకుని టీడీపీ కార్యకర్తలు, పరిటాల కుటుంబ అనుచరులు పెద్ద సంఖ్యలో వారి నివాసానికి చేరుకున్నారు.