గాయాల నుంచి కోలుకోనందుకే... మళ్లీ బ్రేక్: రిసార్టుకే పవన్ కళ్యాణ్ పరిమితం, ఏం చేశారంటే?
శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించిన జన పోరాట యాత్రకు శుక్రవారం కూడా బ్రేక్ పడింది. ఈ నెల 20వ తేదీ నుంచి జిల్లాలోని ఇచ్ఛాపురంలో మొదలైన పవన్ యాత్ర గురువారం అదే జిల్లాలోని టెక్కలి వరకు చేరుకున్నారు. ఈ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 45 రోజుల పాటు కొనసాగాల్సి ఉంది.
అయితే, పవన్ కళ్యాణ్కు ప్రభుత్వం కనీస పోలీస్ భద్రత కల్పించడం లేదని, దీంతో సొంత భద్రతా సిబ్బందితోనే ఆయన తన పర్యటన కొనసాగిస్తున్నారని తెలిపిన జనసేన.. ఈ పర్యటనలో భద్రతా సిబ్బంది గాయపడ్డారని పేర్కొంది. కొత్త సిబ్బంది శ్రీకాకుళం చేరుకోవాల్సి ఉందని అందుకే గురువారం జన పోరాట యాత్ర జరగదని ప్రకటించింది.
పవన్ కళ్యాణ్ యాత్రకు రెండో రోజు బ్రేక్
ఇప్పుడు శుక్రవారం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. 'పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది గాయాల నుండి పూర్తిగా కోలుకోనందున 25.05.2018 (శుక్రవారం) నాడు కూడా ఆయన కార్యక్రమాలు రద్దయ్యాయి. 26.05.2018( శనివారం) నుంచి పోరాట యాత్ర కొనసాగుతుంది' అని పేర్కొంది. దీంతో వరుసగా పవన్ యాత్ర రెండో రోజు కూడా బ్రేక్ పడింది.
పవన్! నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా, మీపక్కనే ఉన్న వ్యక్తి గురించి తెలుసుకో: గౌతు, శిరీష ఆగ్రహం
మార్నింగ్ వాక్ నుంచి అభిమానులతో ముచ్చట్లు
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ ఎచ్చెర్ల మండలంలోని ఓ రిసార్ట్లో బస చేస్తున్నారు. గురువారం ఉదయం అక్కడే మార్నింగ్ వాక్ చేస్తూ ఆహ్లాదంగా గడిపారు. చుట్టూ పరిసరాలను పరిశీలించారు. పక్కనే ఉన్న పాడి పశువులను గమనించారు. అనంతరం తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, అభిమానులతో ముచ్చటించారు.
పవన్ కళ్యాణ్ ఎలా బయటకు రారో చూస్తాం, సిబ్బంది హల్చల్: విద్యుత్ నిలిపివేత, బౌన్సర్కు గాయాలు
అభిమానులను నియంత్రించిన పోలీసులు
పవన్ కళ్యాణ్ అభిమానులతో ఫొటోలు దిగారు. ఆయనను చూసేందుకు చిన్నారులు సైతం వెళ్లడంతో వారితో సరదాగా గడిపారు. అనంతరం రిసార్ట్ లోనికి వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన అభిమానులను పోలీస్ సిబ్బంది నియంత్రించారు.
పవన్ భద్రతా సిబ్బందిలో పలువురికి గాయాలు
కాగా, పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బందిలోని పదకొండు మంది గాయపడ్డారు. మరోవైపు, పవన్కు భద్రత కల్పించామని పోలీసులు చెబుతున్నారు. పవన్ భద్రత విషయంలో ఎలాంటి అయోమయం లేదన్నారు. పవన్కు భద్రతపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. శ్రీకాకుళం ఎస్పీ మాట్లాడుతూ.. జనసేన సెక్యూరిటీకి, స్థానికులకు మధ్య వాదన జరిగినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.