చంద్రబాబు, వైఎస్ జగన్ ఇళ్లకు రెండంచెల భద్రత!
అమరావతి: మరి కొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆరంభం కానుంది. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గురువారం ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమౌతుంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. రెండంచెల భద్రతను కల్పించారు. ఫలితాలు వెలువడే కొద్దీ.. ఓటమి బాట పట్టిన పార్టీల కార్యకర్తలు వారి ఇళ్లపై దాడులకు పాల్పడే ప్రమాదం ఉండొచ్చనే ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
చంద్రబాబు, వైఎస్ జగన్ల నివాసాలు రాజధాని అమరావతి ప్రాంతంలోనే ఉన్నాయి. చంద్రబాబు అధికారిక నివాసం ఉండవల్లి కరకట్ట సమీపంలో ఉంది. తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన నివాసంలో వైఎస్ జగన్ నివసిస్తున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన సొంత ఇంటి నుంచి బుధవారం ఉదయం ఆయన తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు.
సాధారణంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి గట్టి భద్రతను ఏర్పాటు చేస్తుంటారు. తాజాగా- ఓట్ల లెక్కింపును దృష్టిలో ఉంచుకుని అదనపు భద్రతను కల్పించారు. రాష్ట్ర ప్రత్యేక పోలీసుల దళానికి చెందిన రెండు కంపెనీల బలగాలను చంద్రబాబు ఇంటి వద్ద మోహరింపజేశారు. ఫలితాలు వెలువడుతున్న సమయంలో ముఖ్యమంత్రి నివాసానికి వచ్చే నాయకులు, ఇతర కార్యకర్తలను క్రమబద్దీకరిస్తారు. చంద్రబాబు నివాసంలోనికి వెళ్లడానికి ఎంపిక చేసిన వారిని మాత్రమే అనుమతి ఇస్తారు. చంద్రబాబు ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్నారు.
దీనికి సంబంధించిన కొన్ని నిబంధనలను రాష్ట్ర డీజీపీ జారీ చేశారు. పార్టీ నేతలు, రాజకీయ ప్రముఖులు, మంత్రులు, ఉన్నతాధికారులను మాత్రమే చంద్రబాబు నివాసంలోనికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం ముగిసిన తరువాత అదనపు భద్రతను ఉపసంహరించుకుంటారని తెలుస్తోంది.
కాగా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి కూడా రెండంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా అదే ప్రాంగణంలో ఉంది. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోవడం ఖాయం. దీన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడి భధ్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన 50 మంది పోలీసులను కూడా భద్రతకు వినిగిస్తున్నారు.
పాదయాత్ర సందర్భంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో- అనుమానితులను ఎవ్వరినీ ఆయన నివాసానికి గానీ, పార్టీ కేంద్ర కార్యాలయానికి గానీ రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు.
చంద్రబాబు, వైఎస్ జగన్ నివాసాలకు దారి తీసే ప్రాంతాల్లో గురువారం ఉదయం వాహనాల రాకపోకలను దారి మళ్లించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ ప్రముఖుల వాహనాలు పెద్ద ఎత్తున ఆ ఇద్దరు నేతల నివాసాలకు చేరుకోవచ్చని భావిస్తోన్న వాహనాలు స్తంభించిపోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.