సోనియా బర్త్డే: రిజైన్, అవిశ్వాసంపై సీమాంధ్ర కాంగ్రెస్
హైదరాబాద్/న్యూఢిల్లీ: 2009 డిసెంబర్ 9 నాడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు నాడు రాష్ట్ర విభజనపై చేసిన ప్రకటనకు నిరసనగా సోమవారం తెలుగు జాతి విద్రోహ దినంగా పాటించాలని సమైక్య వేదిక పిలుపునివ్వగా, సీమాంధ్ర జిల్లాల్లో బ్లాక్ డేను పాటిస్తున్నారు. సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. సోనియా గాంధీ సోమవారం 67వ ఏట అడుగుపెట్టారు.
మరోవైపు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు సోమవారం ఢిల్లీలో భేటీ కానున్నారు.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. రాజీనామా చేసి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని పలువురు ప్రతిపాదిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇప్పుడే తొందరపడవద్దని వారిస్తున్నారని తెలుస్తోంది. ఒకటి రెండురోజుల్లో కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లుగా రాష్ట్రపతికి లేఖ ఇవ్వాలని యోచిస్తున్నారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ చతికిలపడిన విషయం తెలిసిందే. ఇది సీమాంధ్ర కాంగ్రెసు నేతలకు కొత్త ఊపు తీసుకు వచ్చింది. ఇప్పటికైనా అధిష్టానం విభజనపై వెనక్కి తగ్గాలని లేదంటే ఆంధ్రప్రదేశ్లో అంతకంటే ఘోర పరాభవం తప్పదంటున్నారు. కాంగ్రెసు ఘోర పరాజయం నేపథ్యంలో పార్లమెంటులోను ప్రతిపక్షాలు బిల్లును అడ్డుకుంటాయని భావిస్తున్నారు.
కాగా, తెలుగు ప్రజలను, పార్లమెంటు సభ్యులను మనుషుల్లా చూడకుండా అవమానించిన కేంద్రప్రభుత్వాన్ని ప్రతిపక్షాలతో కలసి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టిపడగొడతామని ఎంపి హర్ష కుమార్ అన్న విషయం తెలిసిందే. లగడపాటి రాజగోపాల్, శైలజానాథ్ వంటి నేతలు కూడా కాంగ్రెసు నాలుగు రాష్ట్రాల ఫలితాల అనంతరం తప్పు దిద్దుకోవాలని సూచించారు.