సీమాంధ్రకు వరాలు మస్త్ మస్త్: ఐఐటి, మెట్రో రైలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై గుర్రుమంటున్న సీమాంధ్రకు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. సీమాంధ్రలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిమ్స్ తరహా శిక్షణా ఆస్పత్రి, మెట్రో రైలు వంటి పలు వరాలను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు హామీ ఇచ్చే అవకాశం ఉంది.
కేంద్ర మంత్రుల బృందం ఆ మేరకు ప్యాకేజీలపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నదీజలాల విషయంలో ఏం చేయాలనేది వారికి అంతు పట్టడం లేదని అంటున్నారు. వాటితో పాటు ఓ కొత్త ఓడరేవును, కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, ఫ్యాషన్ టెక్నాలజీ స్కూల్, కొన్ని పరిశోధన సంస్థలను సీమాంధ్రలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
వివిధ ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు. తెలంగాణకు కూడా కొన్ని ప్రాజెక్టులను ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. హైదరాబాదులో ఇప్పటికే ఐఐటితో పాటు పలు విద్యాసంస్థలు ఉన్నాయి.
గతవారం సమావేశమై మంత్రుల బృందం నదీజలాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర నాయకులు జలాల గ్యారంటీకి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన నదులు తెలంగాణ మీదుగా ప్రవహిస్తుండడంతో తమకు జలాల ఇబ్బంది వస్తుందనేది సీమాంధ్ర నాయకులు ప్రధానంగా వాదిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదుల కోసం కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని రివర్ వ్యాలీ అథారిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీశైలం, నాగార్జునసాగర్, రాజోలిబండ మళ్లింపు పథకం, పోలవరం ప్రాజెక్టులపై విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉంది. నదీజలాలు అన్ని ప్రాంతాలకు లభ్యమయ్యే యంత్రాంగం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.