కావూరితో మంత్రుల భేటీ సీక్రెట్: పనబాక యూటర్న్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందానికి (జివోఎంకు) నివేదికలు సమర్పించే గడువు దాటిపోతున్న నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. వారు ఏం చర్చించారనేది తెలియడం లేదు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడకుండానే కేంద్ర మంత్రులు వెళ్లిపోయారు. సమావేశం వివరాలను గోప్యంగా ఉంచారు.
కావూరి కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, పళ్లంరాజు, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, జెడి శీలం పాల్గొన్నారు. వీరిలో పనబాక లక్ష్మి మాత్రం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడుతూ వచ్చిన ఆమె ప్రస్తుతం మాట మార్చారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కేంద్ర మంత్రులు పార్టీ అధిష్టానం పెద్దలను కలుస్తారని, వారితో పాటు తాను కూడా వెళ్తానని పనబాక లక్ష్మి చెప్పారు. గతంలో తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ ప్రస్తుతం వారితో పాటు పార్టీ అధిష్టానం పెద్దలను కలుస్తానని చెప్పారు. రాష్ట్ర విభజనపై తాము కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగ్ను కలవాలని అనుకుంటున్నామని, అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆమె చెప్పారు.
రాష్ట్ర విభజనను ఆపలేమని పురంధేశ్వరి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి వంటి కేంద్ర మంత్రులు ఇదివరకు బహిరంగంగానే ప్రకటించారు. బిజెపి యూటర్న్ తీసుకుంటే తప్ప రాష్ట్ర విభజనను ఆపలేమని ఓ సందర్భంలో కిల్లి కృపారాణి అన్నారు. విభజన అనివార్యమైతే తాము కోరుకుంటున్నదేమిటో చెప్పాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు అనుకుంటున్నట్లు సమాచారం.