ప్యాకేజీ ఇవ్వాలి: కేంద్రమంత్రులు, హైద్రాబాద్పై నో హామీ!
న్యూఢిల్లీ: సీమాంధ్ర కేంద్రమంత్రులు శుక్రవారం మంత్రుల బృందాన్ని(జివోఎం) కలిశారు. విభజన అనివార్యమని తేలడంతో జివోఎంకు వినతులు అందజేశారు. ఉద్యోగాలు, నీటి కేటాయింపులు, ప్యాకేజీలు తదితర అంశాలపై వారు వినతులు అందజేశారు. అదే సమయంలో హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే జివోఎం మాత్రం హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం మాట అటుంచి మీ డిమాండ్లు వినిపించుకోవచ్చునని సూచించింది.
అధిష్టానం విభజన వైపుకు అడుగులు వేస్తున్న దృష్ట్యా సీమాంధ్రకు కల్పించాల్సిన ప్రయోజనాలు, హైదరాబాద్ ప్రతిపత్తి, జల వివాదాల పరిష్కారాలు, ప్యాకేజీ, ఉద్యోగుల సమస్యలు, ఇతర అంశాలపై దృష్టి సారించారు. జివోఎంను కలిసిన కేంద్ర మంత్రుల్లో పళ్లం రాజు, కావూరు సాంబశివ రావు, జెడి శీలం, కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, కిల్లి కృపారాణి తదితరులు ఉన్నారు. వీరు జివోఎంలోని సుశీల్ కుమార్ షిండే, ఎకె ఆంటోనీ, వీరప్ప మొయిలీలను కలిశారు.
మంత్రులు తొలుత పళ్లంరాజు నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చించుకున్నారు. ఆ తర్వాత ఒక బృందంగా మంత్రుల బృందంలోని సభ్యులను కలుసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరారు. అది సాధ్యం కాదని జివోఎం తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో ఉండే సీమాంద్రుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని మంత్రులు కోరగా దానిపై రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని చెప్పారట.
విభజన జరిగితే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలని రాష్ట్ర నేతలు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. సీమాంధ్రకు ప్యాకేజీ, కొత్త రాజధాని నిర్మాణానికి సహాయం, ఇతరత్రా అంశాలపై ఒక నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఈ మొత్తం నివేదికను క్షుణ్నంగా పరిశీలిస్తామని, దేనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో కూడా ముందుగానే చెబుతామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. జలాల సమస్యలపై కేంద్రమంత్రులు ప్రశ్నించారని తెలుస్తోంది.
సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు ఆంటోనీతో సుమారు గంటన్నరపాటు సమావేశమయ్యారు. వీరి వాదనలను ఆంటోనీ సావధానంగా విన్నారు. అనునయించేలా మాట్లాడారు. విభజన తర్వాత కొత్తగా ఏర్పడే రాష్ట్రం ఆంధ్రప్రదేశే అవుతుందని, రాజధానితో సహా అన్ని వసతులు కొత్తగా కల్పించుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర నేతలు ఆంటోనీ దృష్టికి తీసుకొచ్చారు. కొత్త రాజధానిపై భారీ ప్యాకేజీకి అంగీకరించారట.
హైదరాబాదును పదేళ్ల పాటు రాజధాని చేయాలని, ఆ తర్వాతే దానిపై తేల్చాలని, చెరో రాజధాని అభివృద్ధికి కృషి చేయాలని సీమాంధ్ర కేంద్రమంత్రులు జివోఎంకు విజ్ఞప్తి చేశారు. అయితే హైదరాబాదు పైన వారు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వనట్లుగా తెలుస్తోంది. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇస్తామనేది కాంగ్రెసు హామీ అని తేల్చి చెప్పారట. అయితే ప్రత్యేక ప్యాకేజీకి మాత్రం అంగీకరించారు.