తీర్మానం: జగన్కి సీమాంధ్ర కాంగ్ కౌంటర్, ముందే: శోభా
హైదరాబాద్: అసెంబ్లీలో సమైక్యంపై తీర్మానం చేయాలని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు పట్టుబట్టనున్నారు. వారు గురువారం మధ్యాహ్నం సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీలో సమైక్యంపై తీర్మానం చేయాలనే అంశంపై తాము అన్ని పార్టీల మద్దతును కోరుతామని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. విభజన వేరు, తీర్మానం వేరని, అసెంబ్లీలో తమ వాణిని వినిపిస్తామని చెప్పారు.
తాము అన్ని పార్టీలను కలుస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ హైదరాబాదుకు వచ్చిన నేపథ్యంలో ఆయనను కలుస్తారా అని అడిగితే చూద్దామన్నారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని పట్టుబడుతున్న విషయం తెలిసిందే. దీంతో జగన్ పార్టీకి కౌంటర్గా కాంగ్రెసు సీమాంధ్ర నేతలు తీర్మానం అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చినట్లుగా భావిస్తున్నారు.
తెలంగాణ బిల్లు రాకముందే: శోభానాగిరెడ్డి
అసెంబ్లీకి తెలంగాణ బిల్లు రాకముందే సమైక్యాంధ్రపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు శోభా నాగి రెడ్డి అన్నారు. రూల్ 77 కింద సమైక్యంపై తీర్మానం చేయాలని కోరామన్నారు. పార్టీలకతీతంగా అందరు మద్దతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
కెసిఆర్వి పచ్చి అబద్దాలు: ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు బాబ్లీ పైన నోరు మెదపలేదన్నారు. బీడి గట్టలపైన పుర్రె గుర్తు వేస్తే మాట్లాడలేదన్నారు.
పాట్నాకు జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పాట్నాకు వెళ్లనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతులో భాగంగా ఆయన జాతీయ నాయకులను కలుస్తున్న విషయం తెలిసిందే. రేపు పాట్నాలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కలువనున్నారు.