రాజకీయ సమాధే: అశోక్, సవరణ తర్వాతన్న పళ్లం
హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లును ఓడించేందుకు సీమాంధ్ర ప్రాంత ఎంపీలు పోరాడాలని ఏపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో వారికి రాజకీయ సమాధే అని ఆయన హెచ్చరించారు. శనివారం ఆచప మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు పోరాడినట్లే పార్లమెంటులో ఎంపీలు పోరాటం చేయాలని అన్నారు.
పార్లమెంటులో బిల్లు పెడితే రాష్ట్రంలోని కేంద్ర కార్యాయాలను ముట్టడిస్తామని అశోక్ బాబు హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తామని అన్నారు. విభజన విషయంలో రాష్ట్రపతిని కూడా కలిసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తమ శాయశక్తులూ ఉపయోగిస్తామని అశోక్ బాబు అన్నారు.
విభజనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళ్లాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఎవరు దీక్ష చేసినా తాము మద్దతు ఇస్తామని తెలిపారు. ఫిబ్రవరి 3న సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.
విభజనకు వ్యతిరేకంగా గతంలోలాగే రాజకీయ పక్షాలు ఐక్యత చూపించాలని కోరారు. ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద ధర్నా చేసే యోచనలో ఉన్నామని, ఈ ధర్నాకు సమైక్యవాదాన్ని బలపర్చే పార్టీలను ఆహ్వానిస్తామని అశోక్ బాబు తెలిపారు. బిల్లును ఓడించేందుకు అన్ని జాతీయ పార్టీల సహకారాలు తీసుకోవాలని సీమాంధ్ర నాయకులకు ఆయన సూచించారు.
సవరించిన తర్వాతే బిల్లు పెట్టాలి: పళ్లం రాజు
లోటుపాట్లను సవరించిన తర్వాతనే రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రమంత్రి పళ్లంరాజు కోరారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. ఈ దశలో బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడం ప్రభుత్వానికి సమంజసం కాదని అన్నారు. తాము మొదట్నుంచి బిల్లును వ్యతిరేకిస్తూనే ఉన్నామని చెప్పారు.