అడ్డుకోకుంటే ద్రోహులే: అశోక్, దొడ్డిదారిన: సుజనా
హైదరాబాద్/విజయవాడ: సమైక్య రాష్ట్రం కోసం కృషి చేయని సీమాంధ్ర కేంద్రమంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని ఏపిఎన్జీవోల సంఘం అధ్యక్షడు అశోక్బాబు హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇళ్ల ముట్టడిలో ఏం జరిగినా మంత్రులదే బాధ్యత అని తేల్చిచెప్పారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు బిల్లును అడ్డుకోకపోతే సమైక్య ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు.
పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకోవాల్సిన బాధ్యత సీమాంధ్ర కేంద్రమంత్రులదేనని అశోక్ బాబు చెప్పారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జాతీయ రహదారుల దిగ్భందం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు సమ్మె కొనసాగుతుందని అశోక్బాబు తెలిపారు.
బిల్లును దొడ్డిదారిలో ప్రవేశపెట్టాలని చూస్తోంది: సుజానా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిలో పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చూస్తోందని తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి విమర్శించారు. ఎట్టి పరిస్థితిలోనూ పార్లమెంటులో బిల్లును అడ్డుకుని తీరుతామని ఆయన చెప్పారు. విజయవాడలోని మాంటిస్సోరీ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఎక్స్పోలో ఆయన శనివారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెసు పార్టీ మునిగిపోయే నావలాంటిదని ఆయన అన్నారు. ఒక వర్గానికి న్యాయం చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని దుర్మార్గమైన ఆలోచన చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. బిజెపితో పొత్తు గురించి ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.