సీమాంధ్రుల్లో భయం నిజమే: మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్య
చెన్నై/ హైదరాబాద్ : రాష్ట్రం విడిపోతుందంటే సీమాంధ్రుల్లో భయం ఉన్న మాట నిజమేనని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు, జాతీయ విపత్తు నివారణ నిర్వహణ సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తెలంగాణవాదులు రెచ్చగొట్టే మాటలతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు అభద్రతా భావంతొ ఉన్నారని ఆయన సోమవారం చెన్నైలో మీడియా ప్రతినిధులతో అన్నారు.
జీవోఎం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తెలంగాణలో గానీ, హైదరాబాద్లో గానీ పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడిన సీమాంధ్ర ప్రాంత ప్రజలకు రాష్ట్ర విభజన బాధ కలిగిస్తోందని, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. జీవోఎం అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు చివరి వరకు పోరాడతామని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అఖిలపక్షంలో ఏం చెప్పాలనే దానిపై కాంగ్రెస్ ప్రతినిధులకు స్పష్టత ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసినవారిలో గాదె వెంకట్రెడ్డి, జేసీ దివాకర్రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలతో పాటు, ఢిల్లీ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.