తొలి సిఎం బాబుపై ఆశలు: సీమాంధ్రలో మరో ఐటి హబ్?
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) నూతన రాజధానిపై ఉంది. కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాబోతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో మరో నగరాన్ని ఐటి కేంద్రంగా తీర్చిదిద్దుతారని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ను ఐటి కేంద్రంగా మార్చిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు సీమాంధ్రలో కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తారని పారిశ్రామికవేత్తలు అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా కారణంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటి సంస్థలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఎగుమతి అవుతున్న ఐటిలో సీమాంధ్ర నుంచి ఎగుమతి అవుతున్న వాటా 3శాతం కంటే తక్కువగానే ఉంది.
ప్రత్యేక హోదా వల్ల సీమాంధ్రలోని విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, తిరుపతి లాంటి నగరాల్లో ఐటి పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఓ ఐటి బహుళజాతి సంస్థ ఛైర్మన్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఐటి పరిశ్రమలకు సర్వీస్ టాక్స్ భారంగా మారిందన్నారు. టాక్స్ హాలీడే అనేది కంపెనీలకు పెద్ద సాయంగా కనిపిస్తోందని చెప్పారు. కంపెనీలకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ మొత్తం సేవా పన్ను రూపంలో వెళ్లిపోతోందని తెలిపారు.
ఇప్పటికే ఐటి, పరిశ్రమలను అభివృద్ధి చేయడంలో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడుపై పరిశ్రమలు భారీ ఆశలను పెట్టుకున్నాయి. ప్రస్తుతం ఐటి సేవలు కొనసాగుతున్న విశాఖపట్నంలోనే ఐటి పరిశ్రమలను అభివృద్ధి చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తాడనే అంచనాతో ఉన్న పారిశ్రామికవేత్తలు సీమాంధ్రలో తమ సంస్థలను స్థాపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
విశాఖపట్నంలో నిపుణులైన మానవ వనరులు ఎక్కువగా ఉన్నందున ఈ నగరంలో ఐటిలో తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధిని సాధించగలదని ఆంధ్రప్రదేశ్ ఐటి అధ్యక్షుడు రమేష్ లోకనాథన్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ అధిక సంఖ్యలో విద్యా సంస్థలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నంలో ఐబిఎం, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్ఎస్బిసి, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ లాంటి దిగ్గజ ఐటి సంస్థలు తమ శాఖలను ఏర్పాటు చేసుకున్నాయి. విశాఖ నగరానికి ప్రాధాన్యత ఇస్తే నూతన ఐటి హబ్గా మారే అవకాశం లేకపోలేదు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్న మూడు విశ్వవిద్యాలయాల నుంచి ప్రతీ సంవత్సరం సుమారు 35వేల మంది ఐటి గ్రాడ్యుయేట్స్ బయటికి వస్తున్నారు. సీమాంధ్రలో ఏర్పాటు చేసే సంస్థలు ఐటి విధానాల వల్ల లాభం పొందే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. సముద్ర తీరం ఈ నగరాలకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఐటి, పరిశ్రమలకు నూతన ప్రభుత్వం విద్యుత్ సమస్య లేకుండా చూడాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. నూతన ప్రభుత్వం తీసుకునే చర్యలపై పరిశ్రమల అభివృద్ధి ఆధారపడి ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.