జగన్పై సీమాంధ్ర టిడిపి ఫైర్, అధిష్టానానిదేనని జానా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన సీమాంధ్ర తెలుగుదేశం శుక్రవారం మండిపడింది. శుక్రవారం శాసన సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా పడింది. అనంతరం వారు మీడియా పాయింటు వద్ద మాట్లాడారు. వైయస్ జగన్ తన జగన్నాటకాన్ని ఆపాలన్నారు. సీమాంధ్రులు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని, ఆ వాణిని సభలో వినిపించాల్సిన బాధ్యత లేదా అన్నారు.
సభ సజావుగా సాగాలని అశోక గజపతి రాజు అన్నారు. సభ సజావుగా సాగేలా సభ్యులు, ప్రభుత్వం సహకరించాలన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పాల్సి ఉందని, శాసన సభలో చర్చను అడ్డుకుంటే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సభ నడవకుండా ప్రభుత్వం ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని బయటకు పంపించాలన్నారు. స్పీకర్ కూడా కుట్రలో భాగస్వాములు అవుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. జగన్ పార్టీ వెనుక కాంగ్రెసు హస్తముందని విమర్శించారు. చర్చకు గడువు పెంచవద్దని తాము కోరుతామన్నారు.
24 గంటలు సిద్ధం: కెటిఆర్
స్పీకర్ సభా సంప్రదాయాలు పాటించాలని తెరాస శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. అవసరమైతే తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు 24 గంటలు చర్చించుదామని, గడువు పెంపు ప్రతిపాదనకు మాత్రం అంగీకరించవద్దన్నారు.
అధిష్టానానిదే తుది నిర్ణయం: జానా
బిల్లు పైన చర్చకు గడువు పెంచవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి కోరారు. గడువు పెంచినా పెంచకున్నా అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణకు తమ అభిప్రాయం చెబుతామన్నారు.
కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు ముందే ఓటింగ్ పెట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.