కేసీఆర్.. జగన్ వైఖరి మారిందా: బీజేపీ ఎఫెక్టా..! ఇక పోరుకు సిద్దపడుతున్నారా..!
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అవుతారని తొలి నుండి కేసీఆర్ అంచనా వేసారు. ఎన్నికల సమయం నుండే చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తానంటూ సంచలనానికి కారణమయ్యారు. ఇక, ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత కనిపించింది. కేసీఆర్ నివాసానికి జగన్.. ఉండవల్లిలో జగన్ నివాసానికి కేసీఆర్ రాకపోకలు సాగించారు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఇద్దరి మధ్య అంత సఖ్యత కనిపించటం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం.
ముఖ్యమంత్రి జగన్ గత నెలలో ఢిల్లీ టూర్ తరువాత పరిస్థితులు మారినట్లు కనిపిస్తోందనే వాదన ఉంది. వాస్తవంగా ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చెప్పుకోదగిన స్థాయిలో అభిప్రాయ బేధాలు లేవు. కానీ, బీజేపీ తో పాటుగా కొందరు మేధావులు చేసిన సూచనల మేరకే జగన్ జాగ్రత్త పడుతున్నారా అనే చర్చ మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది.
జగన్..కేసీఆర్ వైఖరిలో మార్పు ఎందుకు..
ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కేసీఆర్ ఆర్డికంగా సహకరిస్తున్నారని ఎన్నికల ప్రచారంలోనే చంద్రబాబు పలు మార్లు ఆరోపించారు. కేసీఆర్ సైతం ఏపీలో జగన్ అధికారంలోకి వస్తారంటూ అనేక సందర్బాల్లో చెప్పుకొచ్చారు. అదే విధంగా జగన్ సీఎం అయిన తరువా ఇద్దరూ ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో వ్యవహరించారు. హైదరాబాద్ లోని ఏపీ అధీనంలో ఉన్న సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారు.
ఇక, తెలంగాణలో ఎరువుల సమస్య వస్తే..దిగుమతి కోసం ఏపీ పోర్టును వినియోగించుకొనేందుకు అనుమతి ఇచ్చారు. టీటీడీ బోర్డులోనూ కేసీఆర్ సిఫార్సు చేసిన వారికి అవకాశం కల్పించారు. ఇక, ఇద్దరూ కలిసి ఏపీ..తెలంగాణ ప్రాంతాలకు మేలు చేసేలా కొత్త ప్రాజెక్టు రూపకల్పన పైన చర్చలు చేసారు. కానీ, సడన్ గా రెండు నెలలుగా మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో ఏకాభిప్రాయంతో ముందకెళ్తామని చెప్పిన అంశాలే ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి.
పోలవరం..కాళేశ్వరం.. నాడు..నేడు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్ది కాలం క్రితం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఈ అంశం మీద రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్టు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా, విచక్షణా రహితంగా తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని పరిశీలించొద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ భాజపా నేత పొంగులేటి సుధాకర్రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వ అఫిడవిట్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అదే విధంగా పోలవరం పైన కేసు విత్ డ్రా చేసుకుంటామని చెప్పిన కేసీఆర్ ఆచరణలో మాత్రం అమలు చేయలేదు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ రాస్తామని చెప్పినా..అదీ చేయలేదు.
బీజేపీ..మేధావుల సూచనలే కారణమా
ఏపీ ముఖ్యమంత్రి జగన్..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సఖ్యత పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. పలువురు దీనిని స్వాగతించగా..మరి కొంత మంది సూచనలు చేసారు. కేసీఆర్ ఆ రాష్ట్రా ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తారని..జగన్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు.
ఇదే సమయంలో తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో సమ్మె మొదలైంది. ఏపీలో ప్రభుత్వ నిర్ణయం పైనా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక రకంగా అది ఏపీ ప్రభుత్వం సైతం చేయలేదనే విధంగా వ్యాఖ్యలు చేసారు. వాటితో సీఎం జగన్ సైతం ఖంగుతిన్నారు. ఏంటి ఆయన అలా అంటున్నారు..అంటూ సహచర మంత్రుల ముందు విస్మయం వ్యక్తం చేసారు. తెలంగాణలో టీఆర్ యస్ కు వ్యతిరేకంగా బలపడాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో కేసీఆర్ తో దూరంగా ఉండటం మంచిదని..కేంద్ర సాయం ఏపీకి ఇప్పుడు చాలా అవసరమని..సొంత పార్టీలోనే చర్చ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. దీని కారణంగానే విబేధాలు లేకపోయినా..వ్యూహాత్మకంగానే దూరం పాటిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.