పుష్కర ప్రమాదంపై బాబుకు చిక్కు: స్వామి చెప్పారా, గోరంట్ల ఏమన్నారు?
రాజమండ్రి: గోదావరి పుష్కరాలు తొలి రోజు జరిగిన ప్రమాద ఘటన పైన టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివరణ ఇచ్చారు. తొలి రోజు రాజమండ్రిలో జరిగిన ప్రమాదంలో 27 మంది భక్తులు మృతి చెందారు. దీనిపై ఎపి సీఎం నారా చంద్రబాబు నాయుడుపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గోరంట్ల వివరణ ఇచ్చారు. చంద్రబాబును పుష్కర ఘాట్లో స్నానం చేయాలని పీఠాధిపతులు సూచించారని తెలిపారు.
భక్తుల రద్దీ దృష్ట్యా చంద్రబాబు సరస్వతీ ఘాట్లో పుష్కర స్నానం చేద్దామనుకున్నారని, కానీ పుష్కర ఘాట్లో స్నానం ఆచరించాలని కంచి పీఠాధిపతి చెప్పారని అధికారులు సూచించారని గోరంట్ల చెప్పినట్లు పత్రికల్లో వస్తోంది.
చంద్రబాబు పుష్కర స్నానం ఆచరించిన తర్వాత అతిథి గృహానికి వెళ్లి బ్రేక్ ఫాస్ట్ చేయవలసి ఉందని, కానీ ఆయన భక్తుల రద్దీని చూసి పుష్కర ఘాట్ వద్ద ఉన్న కంట్రోల్ రూంకు వెళ్లి పర్యవేక్షించాలనే భావించారని చెప్పారు. కానీ, సెక్యూరిటీ సిబ్బంది దానికి అంగీకరించలేదని చెప్పారు.
ఆ తర్వాత చంద్రబాబు పోలీసు అతిథి గృహానికి వచ్చారన్నారు. అది పుష్కర ఘాట్ వద్ద పర్యవేక్షించిందేకు ఏర్పాటు చేసిన మరో కంట్రోల్ రూం అని చెప్పారు.
సీఎం చంద్రబాబు, తాను కంట్రోల్ రూంలో ఉన్న సమయంలో ఓ వాహనం గేట్ ముందు ఆగినట్లుగా తెలిసిందన్నారు. మరోవైపు పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారని చెప్పారు. వెలుపలకు వెళ్లేందుకు, లోపలకు వచ్చేందుకు భక్తులు ఒకే గేటు వద్ద ఎక్కువ మంది కనిపించారన్నారు.
వెంటనే తాను పుష్కర ఘాట్కు వెళ్లానని గోరంట్ల చెప్పారు. అప్పటికే 11 మంది చనిపోయిన విషయాన్ని చెప్పారని, తాను అంబులెన్స్ కోసం ప్రయత్నించానని చెప్పారు. అంబులెన్స్ అక్కడున్నప్పటికీ డ్రైవర్ అందుబాటులో లేరని చెప్పారు.
పరిస్థితిని తాను సీఎం చంద్రబాబుకు చెప్పే ప్రయత్నాలు చేశానని, కానీ ఫోన్ సిగ్నల్స్ సరిగా లేవన్నారు. వెంటనే పోలీసులను అలర్ట్ చేశామన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టిందని చెప్పారు.