కరోనా లాక్డౌన్: జగన్ మరో సంచలనం.. ఆ తప్పులకు విచారణ లేదు.. జరిమానా, వ్యక్తిగత హామీతో సరి..
కరోనా లాక్ డౌన్ కాలంలో ఆకలికేకలు, వలసకూలీల వెతల లాంటి సీరియస్ సమస్యలతోపాటు.. సిల్లీ కాకున్నా, వాహనాలు సీజ్ అయిపోవడంతో చాలా మంది ఇబ్బందుల్లో పడ్డారు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చారనే కారణంతో వివిధ రాష్ట్రాల్లో పోలీసులు కొట్లాది వాహనాలను సీజ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాకపోవడంతో నిషేధాజ్ఞలు మళ్లీ పొడిగిస్తూనే, లాక్ డౌన్ 4.0లో భారీగా సడలింపులు కల్పించారు.
అందులో భాగంగా పర్సనల్ వెహికల్స్ ను కూడా వాడుకోవచ్చని కేంద్రం సూచించడంతో.. రాష్ట్రాలు సీజ్ చేసిన వాహనాలను సంబందిత యజమానులకు తిరిగి అప్పగించే ప్రక్రియను చేపట్టాయి. కాగా, మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఆంధప్రదేశ్ సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం వాహనదారులకు వరంగా మారింది.
అక్కడ కఠినం..
లాక్ డౌన్ కాలంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల విషయంలో మిగతా రాష్ట్రాలు కొద్దోగొప్పో కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో.. సీజ్ కు గురైన వాహనదారులందరూ తప్పనిసరిగా కేసు ఎదుర్కోవాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు, కేసుల సంఖ్య లక్షల్లో ఉండటంతో ఈ-కోర్టు ద్వారా విచారణకు ఏర్పాట్లు చేస్తున్నారు. యజమానులకు ముందుగానే విచారణ తేదీ, టైమ్ స్లాట్ ఇచ్చి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జిల ముందు ప్రవేశపెడతారు. ఏపీ సర్కారు మాత్రం ఈ తతంగాన్ని మరింత సులభతరం చేసింది.
రూ.100 జరిమానాతోపాటు..
ముఖ్యమంత్రిగా తొలి వార్షికోత్సవాన్ని జరుపుకొన్ననాడే.. సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి జగన్ కీలక ఆదేశాలిచ్చారు. వాహనదరులను నుంచి కేవలం రూ. 100 జరిమాన వసూలు చేస్తే సరిపోతుందని, అలాగే, మరోసారి నిబంధనలను ఉల్లంఘించబోమంటూ వారి నుంచి స్వీయ హమీపత్రాన్ని తీసుకోవాలని పోలీసు శాఖకు సీఎం సూచించారు. పోలీస్ స్టేషన్ల వద్ద వాహనాలను తిరిగి ఇచ్చేటప్పుడు సోషల్ డిస్టెన్స్, ఇతర జాగ్రత్తలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా, మిగతా రాష్ట్రాల మాదిరిగా ఏపీలోని వాహనదారులు.. కోర్టుకు హాజరు కాకుండానే తమ వాహనాలను తిరిగితీసకునే లక్కీ చాన్స్ లభించినట్లయింది.
డీజీపీ ప్రకటన..
వాహనాలను యజమానులకు తిరిగిచ్చేసే విషయంలో సీఎం జగన్ సూచన మేరకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ బహిరంగ ప్రకటన చేశారు. లాక్డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లొచ్చని, ఆ మేరకు యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని చెప్పారు. అయితే, ఓనర్లు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఏపీ పోలీస్ శాఖ వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానూ ఈ సమాచారం ఇచ్చారు.
Recommended Video
మొత్తం ఎన్ని వాహనాలంటే..
ఏపీ వ్యాప్తంగా లాక్ డౌన్ కాలంలో సీజైన వాహనాల సంఖ్య 70వేల పైచిలుకుగా ఉన్నట్లు డీజీపీ సవాంగ్ చెప్పారు. టెక్నికల్ గా వ్యక్తులు కోర్టులకు హాజరుకానప్పటికీ.. వాహనాలు తిరిగిచ్చే ప్రక్రియంతా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారమే జరుగుతుందని, కేసులు నమోదైన యజమానలు సంబంధిత పత్రాలు సమర్పిస్తేనే వాహనాలు తిరిగిస్తామని తెలిపారు. ఇక తెలంగాణకు సంబంధించి లాక్ డౌన్ కాలంలో మొత్తం 4.5లక్షల వాహనాలను పోలీసులు సీజ్ చేయగా, వాటిలో ఒక్క హైదరాబాద్ పరిధిలోనే సుమారు 3.25 లక్షల వాహనాలున్నాయి. అప్పగింత ప్రక్రియ సులభతరం చేయడంపై ఏపీలో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.