శేఖర్ రెడ్డికి షాక్ ఇచ్చిన చంద్రబాబు: పదవి నుంచి తొలగింపు
వంద కోట్ల రూపాయలు, 127 కిలోల బంగారం ఐటి అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో శేఖర్ రెడ్డికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆయనను టిటిడి బోర్డు నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి: భారీ మొత్తంలో నగదు, బంగారం ఐటి అధికారులకు చిక్కిన నేపథ్యంలో వ్యాపారి శేఖర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. శేఖర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి నుంచి తొలగించాలని చంద్రబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దాంతో ఆయనను పదవి నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. గత రెండు రోజులుగా తమిళనాడులోని శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ రెడ్డి నివాసాల్లో ఐటి అధికారులు నిర్వహించిన సోదాల్లో దిమ్మతిరిగే నగదు, బంగారం బయటపడిన విషయం తెలిసిందే.
శేఖర్ రెడ్డి నివాసాల్లో 106 కోట్ల రూపాయల నగదు, 127 కిలోల బంగారం పట్టుపడిన విషయం తెలిసిందే. తమిళనాడు రాజకీయ పెద్దల ద్వారా శేఖర్ రెడ్డి టిటిడి బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు ఆయన సన్నిహితుడని వార్తలు వచ్చిన విషయం కూడా తెలిసిందే.
పన్నీరు సెల్వం ద్వారా శశికళ చెప్పడంతో జయలలిత శేఖర్ రెడ్డిని టిటిడి బోర్డుకు సిఫార్చు చేసినట్లు సమాచారం. శేఖర్ రెడ్డికి శశికళ వ్యాపారాలతో సంబంధాలు ఉన్నట్లు అనుానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు అధికారులతో కుమ్మక్కయి శేఖర్ రెడ్డి పాత నోట్లను మార్చుకున్నట్లు చెబుతున్నారు. పట్టుబడిన బంగారంలో 70 కిలోలు కడ్డీల రూపంలో ఉంది. గదుల నిండా బంగారం, నగదు ఉండడాన్ని చూసి ఐటి అధికారులు అవాక్కయ్యారు.
ఆ ధనమంతా తనదేనని శేఖర్ రెడ్డి చెబుతున్నట్లు సమాచారం. అయితే, వాటికి లెక్కలు లేవని అధికారులు అంటున్నారు. ఈ కేసును ఐటి శాఖ దర్యాప్తు నిమిత్తం సిబిఐకి సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. శేఖర్ రెడ్డి ఇంటి వద్ద పార్కు చేసిన కారులో కూడా ఐటి అధికారులు నగదును గుర్తించారు. శేఖర్ రెడ్డి మిత్రులు శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్లను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.