మరోసారి షాకిచ్చిన శాసనమండలి కార్యదర్శి: సెలక్ట్ కమిటీల ఏర్పాటు ఫైలు మళ్లీ వెనక్కి
అమరావతి: సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సెలక్ట్ కమిటీల ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ పంపిన ఫైలును మండలి కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీలు ఏర్పాటు చేయాలంటూ మండలి ఛైర్మన్ షరీఫ్.. కార్యదర్శికి ఇటీవల కూడా ఫైలును పంపించారు.
అప్పుడు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఫైలు ఉందంటూ శాసన మండలి కార్యదర్శి తిప్పిపంపారు. మండలి ఛైర్మన్ మల్లీ ఆ ఫైలును మండలి కార్యదర్శికి పంపినప్పటికీ తాజాగా రెండోసారి కూడా ఆయన తిప్పి పంపడం గమనార్హం.
నిబంధనల ప్రకారం సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ ఛైర్మన్ షరీఫ్కు పంపిన నోట్లో శాసనమండలి కార్యదర్శి స్పష్టం చేశారు. మరోవైపు గడువులోగా సెలక్ట్ కమిటీలు ఏర్పాటు కానందున బిల్లులు ఆమోదం పొందినట్లేనని, ఇక గవర్నర్ ఆమోదమే తరువాయి అని మంత్రులు, అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. మరోవైపు శాసనమండలి కార్యదర్శిపై అధికార పార్టీ ఒత్తిడి తెస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇటీవల ఎమ్మెల్యే రోజా కూడా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆమోదం పొందాయని వ్యాఖ్యానించారు. 14 రోజుల్లోపు సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో రాజధాని బిల్లు ఆమోదం పొందినట్లేనని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా వ్యాఖ్యానించారు. అంతేగాక, మూడు రాజధానులను వ్యతిరేకించిన చంద్రబాబును రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు.
పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. శాసనమండలి ఆమోదం కోసం పంపితే.. అక్కడ టీడీపీ సభ్యులు ఎక్కువగా ఉండటంతో ఆ బిల్లులకు ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ బిల్లులపై సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
కాగా, మండలిలో బిల్లులపై చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అధికార పార్టీ సభ్యులు ఛైర్మన్పైనా విమర్శలు చేశారు. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.