ఆసుపత్రికి వెళ్తూ అటవీప్రాంతంలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది, ఎందుకలా
తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ఓ మహిళ తనకు తానే ప్రసవం చేసుకొంది.రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ప్రసవం కోసం భర్తతో కలిసి వెళ్తూ మార్గమధ్యలోనే ఆమె అటవీ ప్రాంతంలోనే తనకుతానే పురుడుపోసుకొంది.
రంపచోడవరం :ఆసుపత్రి సౌకర్యం అందుబాటులో లేదు. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళాలంటే కనీసం 30 కిలోమీటర్లు నడక సాగించాల్సిందే. ఆసుపత్రికి బయలుదేరిన గిరిజన మహిళ మార్గమద్యలో తనకు తానే పురుడుపోసుకొంది. చివరకు 108 లో ఆమెను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకొంది.
తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు వైద్యం అందడానికి ఇబ్బంది అవుతోంది.గిరిజన ప్రాంతాలకు చెందిన ప్రజలు వైద్యం కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది.
అయితే 108 వాహనాలు కూడ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళేందుకు సరైన రహదారి సౌకర్యాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రజలు సమీప ఆసుపత్రులకు వెళ్ళాలంటే దూరం వెళ్ళాల్సి వస్తోంది.
తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుపల్లి మండలంలోని కింటుకూరు గ్రామానికి చెందిన పాలించి లక్ష్మి అనే మహిళ ప్రసవం కోసం తన భర్తతో కలిసి రంపచోడవరం ఆసుపత్రికి బయలుదేరింది. అసలే నెలలు నిండాయి. భర్తతో కలిసి గుట్టలు, అడవి ప్రాంతాన్ని దాటుకొని రంపచోడవరం ఆసుపత్రికి బయలుదేరింది ఆమె.సుమారు పదికిలోమీటర్ల దూరం నడిచింది ఆమె.
అయితే మార్గమద్యలో దాహంగా ఉందని తన భర్తకు చెప్పింది. తనకు మంచినీళ్ళు కావాలని కోరింది. దరిమిలా భర్త ఆమెకు మంచినీళ్ళు తెచ్చేందుకు వెళ్ళాడు. అదే సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. సమయానికి భర్త లేడు. పురుటి నొప్పులు తీవ్రమయ్యాయి.
ఇక చేసేదిలేక ఆమె తనకు తానే పురుడుపోసుకొంది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను పేగు నుండి వేరుచేసింది. భర్త మంచినీళ్ళు తెచ్చేసరికి ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ పరిస్థితిని ఓ యువకుడు గమనించాడు. తన మొబైల్ ద్వారా 108 కి సమాచారం ఇచ్చాడు. రహాదారి సౌకర్యం ఉన్నవరకు 108 వాహనం వచ్చింది.
వాహనం వచ్చిన ప్రదేశం వరకు భార్యను, కూతురును తీసుకొని వెళ్ళాడు భర్త,.108 వాహనంలో వారిని రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. రంపచోడవరం ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.