ఆ రాయలసీమ యువకుల వాహనం ప్రమాదానికి కారణం సెల్ఫీ వీడియోనే...అందులోనే రికార్డ్ అయింది
కర్నూలు:'అరవింద సమేత' సినిమాలో సీమ నేపథ్యాన్ని కించపరిచారంటూ పోరాటం చేస్తున్న రాయలసీమ యువకుల బృందం రోడ్డు ప్రమాదానికి గురవడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణం ఏంటో వెలుగు చూసింది. ఈ బృందంలోని యువకుల సెల్ఫీ వీడియో మోజే వారిలో ఒకరి ప్రాణాన్ని ఒలిగొనగా మరో నలుగురు తీవ్రంగా గాయపడేలా చేసింది. అందుకు కారణమైన ఆ 'సెల్ఫీ వీడియో' లోనే ఈ ప్రమాదం జరిగిన తీరు రికార్డు అవడంతో ప్రమాదం ఎలా జరిగిందనేది తేలిపోయింది.
'అరవింద సమేత' సినిమాలో రాయలసీమ నేపధ్యాన్ని కించపరిచారంటూ ఆ ప్రాంతానికి చెందిన పలు సంఘాలు,వ్యక్తులు ఆందోళనకు నిరసనలకు దిగారు. ఇదే క్రమంలో జలం శ్రీను, సీమ కృష్ణ నాయక్, రవికుమార్, రాజశేఖరరెడ్డి అనే యువకుల బృందం కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. ఆ క్రమంలో వీరు ఇదే విషయమై సోమవారం హైదరాబాదు లో ప్రెస్ మీట్ ను నిర్వహించడంతో పాటు అదే రోజు సాయంత్రం హెచ్.ఎం టివి లో డిబేట్ లో కూడా పాల్గొన్నారు. ఆ తరువాత కర్నూలు వచ్చేశారు.
ఈ నేపథ్యంలో ఇదే విషయమై మంగళవారం సాయంత్రం టివి 9 ఛానెల్ లో చర్చలో పాల్గోవాల్సిందిగా ఈ బృందానికి ఆహ్వానం అందగా అందులో పాల్గొనేందుకని వీరు కర్నూలు నుంచి బొలేరో వాహనంలో హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం తెలంగాణా ప్రాంతం గుండా ప్రయాణిస్తుండగా ఆ సమయంలో భారీ వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో వాహనంలోని యువకులు తమ తమ స్మార్ట్ఫోన్ల్లో సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సీమ క్రిష్ణ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీస్తున్నాడు.
'ఈ వర్షం రాయలసీమలో పడితే వేసిన శనక్కాయన్న పండుతాది. తెలంగాణలో మాత్రం వర్షం బ్రహ్మాండంగా పడుతోంది. ఈ వాన చూస్తుంటే సంతోషంగా ఉంది. మనసైడు కూడా ఈ వర్షం పడాలా' అని వెనక సీటులో నుంచి ముందుకు వంగి సీమ క్రిష్ణ సెల్ఫీ వీడియోలో మాట్లాడుతుండగా మిగిలిన వాళ్లు చూస్తున్నారు. ఈ క్రమంలో కారు నడుపుతున్న వ్యక్తి కూడా డ్రైవింగ్ మీద కాకుండా సెల్ఫీ మీదనే దృష్టి ఉంచినట్లు అనిపిస్తోంది.
అలా ఆ సెల్ఫీ వీడియోలో సీమ క్రిష్ణ మాట్లాడుతుండగానే ముందు వెళ్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం బలంగా ఢీకొంది. ఆ ప్రమాదం జరిగిన విధం కూడా ఈ సెల్ఫీ వీడియోలో రికార్డ్ అయింది. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల టోల్ప్లాజా వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఆ సెల్ఫీ వీడియో బయటకు రావడంతో ప్రమాదానికి కారణం బైటపడింది. కేవలం ఈ యువకుల సెల్ఫీ మోజే జలం శ్రీను అనే యువకుడి ప్రాణాలు బలిగొనగా, మిగితావారిని తీవ్రంగా గాయపరిచిందని తెలుస్తోంది. హరినాథ రెడ్డి అప్పిరెడ్డి అనే వ్యక్తి ఫేస్ బుక్ లో వివరాలతో పాటు, ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా తొలుత బైటకు సమాచారం తెలిసింది.