అశోక్పై దౌర్జన్యం: బాబు స్పందన, 'శివసేన ఎంపీలు దారుణంగా వ్యవహరించారు'
పార్లమెంటులో టిడిపి నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుపై శివసేన ఎంపీలు దాడికి ప్రయత్నించిన అంశంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇది దురదృష్టకర సంఘటన అని, బాధాకరమన్నారు.
అమరావతి/న్యూఢిల్లీ: పార్లమెంటులో టిడిపి నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుపై శివసేన ఎంపీలు దాడికి ప్రయత్నించిన అంశంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇది దురదృష్టకర సంఘటన అని, బాధాకరమన్నారు.
శివసేన ఎంపీల దౌర్జన్యం: అశోక్ గజపతిరాజుపై దాడికి యత్నం, రక్షణగా టీడీపీ ఎంపీలు
చట్టసభల్లో ఇలాంటివి పునరావతృతం కాకుండా చూసుకోవాలన్నారు. వీటి పట్ల అన్ని పార్టీలు కఠినంగా ఉండాలన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలుగా మిగిలిపోతాయని చెప్పారు. సభలో అందరు హుందాగా వ్యవహరించాలన్నారు.
ఖండన
ఈ ఘటనను ఏపీ మంత్రి, టిడిపి యువనేత నారా లోకేష్ ఖండించారు. ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. అశోక్ పట్ల కొందరు ఎంపీల ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు.
అనంత్ గీతే కేంద్రమంత్రిగా ఉండి..
ఓ మంత్రిగా ఉండి కూడా అనంతం గీతే మరో కేంద్రమంత్రిపై దాడి చేసే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసం అని టిడిపి ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా దురుసుగా ప్రవర్తిస్తే ఏం వస్తుందన్నారు.
శివసేన ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి, మరో ఎన్డీయే భాగస్వామి కేంద్రమంత్రిపై దాడి చేయడం ఏమిటన్నారు. ఎంపీలు చాలా దారుణంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. సభ వాయిదా పడిన తర్వాతనే ఈ దాడి యత్నం జరిగిందన్నారు.
సుమిత్రా మహాజన్ విస్మయం
ఎయిరిండియా ఉద్యోగినిని చెప్పుతో కొట్టిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గురువారం లోకసభలో మాట్లాడిన అనంతరం అనంత్ గీతే కల్పించుకొని, ఎలాంటి విచారణ జరపకుండానే ఎయిరిండియా ఎలా నిషేధం విధిస్తుందని ప్రశ్నించారు. అనంత్ గీతేతో పాటు ఇతర ఎంపీలు అశోక్ వైపు దూసుకు వచ్చారు.
ఈ సమయంలో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజ్ నాథ్ సింగ్లు కల్పించుకొని, వారిని ఆపేశారు. అప్పటికే టిడిపి ఎంపీలు, సహచర మంత్రులు కొందరు అశోక్కు రక్షణంగా నిలబడ్డారు. ఈ ఘటనపై స్పీకర్ సుమిత్రా మహాజన్ విస్మయం వ్యక్తం చేశారు.
అశోక్ ఏం చెప్పారంటే..
అంతకుముందు ఈ అంశంపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. శివసేన ఎంపీ గైక్వాడ్ సమస్యను త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఆ తర్వాత అశోక్ మాట్లాడారు. ఎయిర్ ఇండియా లేదా ఇతర ఎయిర్ లైన్స్ ఏవీ కూడా ప్రయాణీకులకు లేదా ఎంపీకి వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే, అందరికీ ఒకే విధమైన నిబంధనలు ఉంటాయని చెప్పారు. ఎంపీకి ఎయిర్ లైన్స్ టిక్కెట్ రద్దు చేసే అంశంలో తాను జోక్యం చేసుకోనని, ఏదైనా ఉంటే ఎయిర్ లైన్స్ను అడగాలని చెప్పారు.
ప్రయాణీకుల భద్రత విషయంలో రాజీపడమన్నారు. శివసేన ఎంపీ లేఖలు రాశారన్నారు. వాటిని అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. ఆయనపై కేసు నమోదయినందున విచారణ జరుగుతోందన్నారు.