టాలీవుడ్ లో విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత..
హైదరాబాద్: అలనాటి ప్రముఖ దర్శకుడు దుర్గా నాగేశ్వరరావు(87) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్, రామాంతపూర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దాసరి శిష్యుల్లో ఒకరైన దుర్గా నాగేశ్వరరావు బొట్టు కాటుక, సుజాత, స్వర్గం,పసుపు-పారాణి వంటి 14విజయవంతమైన సినిమాలు చేశారు.
సినిమా రంగంలోకి ఆలస్యంగానే ప్రవేశించిన ఆయన.. 1979లో వచ్చిన విజయ చిత్రంతో దర్శకుడుగా మారారు. తక్కువ సినిమాలే చేసినప్పటికీ దర్శకుడిగా తనదైన ముద్ర వేయగలిగారు దుర్గా నాగేశ్వరరావు. తెలుగు సినిమా మొదటి తరం నటుల్లో ఒకరైన చిలకలపూడి సీతారామంజనేయులుకు నాగేశ్వరరావు స్వయానా మేనల్లుడు.
తెలుగు సినీ పరిశ్రమ సంతాపం:
దుర్గా నాగేశ్వరరావు మృతికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం నివాళులు అర్పించింది. దుర్గా నాగేశ్వరరావుతో పాటు, కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన మరో ప్రముఖ దర్శకుడు ఈరంకి శర్మ, సీనియర్ కో డైరెక్టర్ రామ సూరిలకు దర్శకుల సంఘం శ్రద్ధాంజలి ఘటించింది. నివాళులు అర్పించిన వారిలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత కానూరి, దర్శకులు ధవళ సత్యం, సీవీ రావు, పర్వతనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు.