సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్ను భలేగా ఆకట్టుకున్న ఫొటో: పిక్ ఆఫ్ ది డే
అమరావతి: వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహించనున్న జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది. దీనికోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం- అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అదే సమయంలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జీ20 షెర్పా సమావేశం కూడా కొనసాగుతోంది. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్.. వంటి వివిధ దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు పాల్గొనే సమ్మిట్ కావడం వల్ల కేంద్రం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
అన్ని పార్టీల నేతలూ..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డీ రాజా ఇందులో పాల్గొన్నారు. సుదీర్ఘకాలం పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, అంతర్జాతీయంగా భారత్ క్రియాశీలక పాత్రను పోషించాల్సిన అంశాలు, రాష్ట్రాల అవసరాల గురించి ఇందులో చర్చించారు.
జగన్, చంద్రబాబు
ఈ సదస్సులో వైఎస్ జగన్, చంద్రబాబు ఒకే వేదికపై కనిపించారు. తొలుత వైఎస్ జగన్, సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశ వేదిక రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ప్రధాని మోదీ వారిని సాదరంగా ఆహ్వానించారు. అదే సమయంలో చంద్రబాబు, వివిధ పార్టీలకు చెందిన అధినేతలు అక్కడికి వచ్చారు. చంద్రబాబుతో కొద్దిసేపు మోదీ మాట్లాడారు. అనంతరం వారంతా తమకు కేటాయించిన స్థానాల్లో కూర్చున్నారు. మమత బెనర్జీ, వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, చంద్రబాబు ఒకే వరుసలో కూర్చోవడం ఆకర్షించింది.
సోషల్ మీడియాలో వైరల్గా..
అఖిలపక్ష భేటీ సందర్భంగా ప్రధాని మోదీ- వైఎస్ జగన్ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్న ఇమేజెస్పై నెటిజన్ల కామెంట్లు తోడయ్యాయి. ఈ ఫొటోల్లో ఒకటి- ఏపీకి చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ రజత్ భార్గవను బాగా ఆకర్షించింది. దాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. పిక్ ఆఫ్ ది డే గా అభివర్ణించారు.
రజత్ భార్గవ ట్వీట్..
రజత్ భార్గవ 1990 బ్యాచ్ ఉమ్మడి ఏపీ క్యాడర్ అధికారి. రాష్ట్ర విభజన అనంతరం ఆయనను ఏపీకి కేటాయించింది డీఓపీటీ. ప్రస్తుతం రెవెన్యూ, యువజన వ్యవహారాలు, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తోన్నారు. గతంలో దేశ రాజధానిలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా పని చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రజత్ భార్గవ.. మోదీ-వైఎస్ జగన్ కలిసి దిగిన ఫొటోను పిక్ ఆఫ్ ది డే గా పేర్కొంటూ పోస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.