ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ: ఆయన స్థానంలో..!
అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్నారు. ద్వివేది స్థానంలో మరో సీనియర్ ఐఎఎస్ అధికారి కె విజయానంద్ను నియమించారు. 1992 బ్యాచ్కు చెందిన విజయానంద్.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కొన్ని కీలక శాఖల్లో పనిచేశారు.
జెన్కో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. బొగ్గు కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపించాయి. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మంత్రిగా వ్యవహరించిన ఐటీ శాఖకు ముఖ్య కార్యదర్శిగా కూడా విజయానంద్ పనిచేశారు. తాజాగా- ఆయనను ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పోస్టుకు ఇక పెద్దగా ప్రాధాన్యత ఉండదనే అంటున్నారు.
అత్యంత క్లిష్టమైన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించిన అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదికి పేరుంది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. కొద్దిరోజుల పాటు తనకు పోస్టింగ్ ఇవ్వవద్దని కోరగా.. ప్రభుత్వం అందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. ద్వివేది స్థానంలో విజయానంద్ను నియమించారు. ద్వివేదిని రిలీవ్ చేశారు. ప్రస్తుతం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు.