Press Academy Chairman: ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి..! సాక్షి, బీబీసీల్లో
అమరావతి: ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కార్యదర్శి టీ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన శ్రీనాథ్ రెడ్డి పలు దినపత్రికల్లో పనిచేశారు. పాత్రికేయ రంగంలో ఆయనకు 40 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
ఎట్టకేలకు కేంద్రం నిధులు: పోలవరానికి రూ.1850 కోట్లు విడుదల: ఏపీ ప్రభుత్వానికి రిలీఫ్..!
చెన్నై ట్రిప్లికేన్ లోని హిందూ హైస్కూలులో పదవ తరగతి వరకు చదివారు. అనంతరం తిరుపతిలోని ప్రతిష్ఠాత్మక శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బీకామ్ అభ్యసించారు. అనంతరం పాత్రికేయ రంగంలో అడుగు పెట్టారు. ప్రారంభంలో తెలుగు దినపత్రికల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు. అనంతరం కొన్ని ఆంగ్ల పత్రికల్లో చాలాకాలం పాటు కొనసాగారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు సంస్థలు, బీబీసీ, సాక్షి దినపత్రికల కార్యాలయాల్లో ఉన్నత హోదాలో పని చేశారు.
జర్నలిస్టుగా కడప జిల్లాలో సుమారు రెండున్నర దశాబ్దాల పాటు పనిచేశారు. పులివెందుల నియోజకవర్గం పరిధిలోని సింహాద్రిపురం మండలానికి చెందిన శ్రీనాథ్ రెడ్డికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కడప జిల్లా అధ్యక్షుడిగా పాత్రికేయుల హక్కుల కోసం కృషి చేశారు. సెవెన్ రోడ్స్ జంక్షన్ పేరు మీద ఆయన రాసిన ప్రత్యేక కథనాలు శ్రీనాథ్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టాయి. సమకాలీన రాజకీయాలు, ఆర్థిక, సామాజిక అంశాలను ఆధారంగా చేసుకుని ఆయన వాటిని రాశారు.