బీజేపీతో నేతలతో జేసీ భేటీ..బాబుకు చెప్పే: పయ్యావులకుఇలా ఆఫర్: క్యూ లో పరిటాల ఫ్యామిలీ..!
బీజేపీ నేతలు ఆపరేషన్ అనంత వేగవంతం చేసారు. ఇప్పటికే అనంతపురం నుండి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదా పురం సూరి బీజేపీలో చేరారు. ఇక కొద్ది రోజులుగా అనంతపురం టీడీపీ నేతలతో బీజేపీ నేతలు టచ్లో ఉన్నారు. ఇక అందులో భాగంగా జిల్లాకు చెందిన సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు పవన్తో కలిసి ఢిల్లీలో బీజేపీ నేతల తో సమావేశమయ్యారు. ఇక ఇదే జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత పయ్యావుల కేశవ్ను తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా అనంతపురం టీడీపీలో మరో ప్రధాన కుటుంబం పరిటాల. ఇప్పుడు ఆ పరిటాల వర్గం సైతం తర్జన భర్జన పడుతోంది. వీరితో బీజేపీ నేతలు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.
పోరాటాలకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపు .. టీడీపీ సైన్యం పోరాటం చేసే స్థితిలో ఉన్నారా ?
బీజేపీ ఆపరేషన్ అనంత..జేసీ ఖాయం..
ఏపీలో టీడీపీ టార్గెట్గా ఆపరేషన్ ప్రారంభించిన బీజేపీ ముందుగా అనంతపురంలో తెలుగుదేశం నేతలను తమ వైపు తిప్పుకోవటం ప్రారంభించిది. అందులో భాగంగా ఇప్పటికే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరిని బీజేపీలోకి ఆహ్వానించారు. ఆయన సమయం అడిగినా ఒత్తిడి చేసి మరీ హడావుడిగా పార్టీ కండువా కప్పేసారు. ఇదే సమయంలో జిల్లాకు చెందిన సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డితోనూ కొద్ది రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికిప్పుడు టీడీపీని వీడి బీజేపీలోకి చేర్చేందుకు ఇప్పటికైతే సుముఖంగా లేరు. ఇక, ఇదే సమయంలో జేసీ దివాకర్ రెడ్డి..తనయుడు పవన్ రెడ్డితో కలిసి ఢిల్లీలో బీజేపీ నేతలతో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో జేసీ దివాకర్రెడ్డి తన కుమారుడు పవన్కు రాజకీయ భవిష్యత్ పైన బీజేపీ నేతల నుండి హామీ కోరగా అందుకు స్పష్టత వచ్చినట్లు చెబుతున్నారు. మిగిలిన నేతలను తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని జేసి దివాకర్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. అయితే, అనుచర వర్గం ఇప్పుడు జేసీతో కలిసి బీజేపీలోకి వెళ్తుందా లేక సోదరుడు ప్రభాకర్ రెడ్డి తో పాటే ఉంటుందా అనేది తేలాల్సి ఉంది.
పయ్యావులకు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే..
అనంతపురం జిల్లాలో టీడీపీకి ముఖ్య నేతగా ఉంటూ..బలమైన వాయిస్గా ఉన్న పయ్యావుల కేశవ్ తోనూ బీజేపీ నేతలు మంతనాలు సాగించినట్లు చెబుతున్నారు. అందునా పయ్యావుల కేశవ్ బీజేపీలోకి వస్తే ఆయనకు పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించటానికి సిద్దంగా ఉన్నామని బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, కేశవ్ మాత్రం ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేనని చెప్పినట్లు తెలుస్తోంది. కేశవ్ ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలిచినా.. పార్టీ లో మాత్రం గతంలో మాదిరి అంత యాక్టివ్గా లేరనే వాదన టీడీపీలో ఉంది. బీజేపీ నేతలు కేశవ్తో టచ్లో ఉన్నట్లుగా టీడీపీలో ప్రచారం సాగుతోంది. అనంతపురం జిల్లాలో తాజా ఎన్నికల్లో టీడీపీ రెండు సీట్లు మాత్రమే గెలిచింది. సినీ హీరో బాలకృష్ణతో పాటుగా కేశవ్ మాత్రమే గెలిచారు. అయితే, కేశవ్ ఇప్పటికైతే పార్టీ మారేందుకు సిద్దంగా లేరు. రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరమే.
Recommended Video
చంద్రబాబుకు చెప్పే...ఇక పరిటాల అడుగులెటు..
అనంతపురం జిల్లాలో టీడీపీకి మరో కీలక మైన కుటుంబం పరిటాల వారసులు. తాజా ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన కుమారుడు శ్రీరాంను పరిటాల సునీత బరిలోకి దింపారు. అయితే ఈ ఎన్నికల్లో శ్రీరాం ఓడిపోయారు. ఎన్నికలు పూర్తయిన నాటి నుండి వారు అంత యాక్టివ్గా లేరు. నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వారు బీజేపీలోకి వెళ్లే యోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ ముఖ్య నేతలు వారితో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, వైసీపీ అధికారంలోకి రావటంతో..బీజేపీలోకి వెళ్లటమే అన్ని రకాలు గా శ్రేయస్కరంగా వారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక, జేసి దివాకర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను కలిసే ముందు గుంటూరులో చంద్రబాబు తో సమావేశమయ్యారు. ఆయన బీజేపీలోకి వెళ్లాలనుకుంటున్న విషయాన్ని చంద్రబాబుకు చెప్పిన తరువాతనే ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది.