వైఎస్ జగన్కు కొత్త సవాల్: ఒకేసారి ఆరుమంది: ఇద్దరికి రిజర్వ్: ఆ నలుగురెవ్వరు?
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. శాసన మండలి ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఒకేసారి ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఏర్పడనున్న ఖాళీలను భర్తీ చేయాల్సి ఉన్నందున- ఆశావహుల పేర్లు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేలతో సమాన హక్కులు, అధికారాలు ఉన్న పోస్ట్ కావడం వల్ల తాకిడి అధికమౌతోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కని వారు, తమ స్థానాన్ని త్యాగం చేసిన నేతలు క్రమంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బారులు తీరుతున్నారు. మండలికి వెళ్లే అవకాశాన్ని కల్పించాలంటూ పార్టీ అగ్ర నేతలను కోరుతున్నారు.
పార్టీ కోసం కష్టపడిన వారికే ఛాన్స్
పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యత ఇస్తారనేది తెలిసిన విషయమే. దీనిపై ఇదివరకే సీనియర్లు ఆఫ్ ది రికార్డ్గా కొన్ని పేర్లను వెల్లడిస్తున్నారు. ఒకేసారి ఆరు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అవకావం కోసం ఆశించే వారి సంఖ్య పెద్దగానే ఉంటోందని, అభ్యర్థుల ఎంపికలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. సీనియర్లతో పాటు తెలుగుదేశానికి గుడ్బై చెప్పి, పార్టీలో చేరిన వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
రెండు స్థానాలు రిజర్వ్ అయినట్టే?
ప్రస్తుతం ఎన్నికలను నిర్వహించబోయే ఆరింట్లో రెండు స్థానాలను రిజర్వ్ చేసి ఉంచినట్లు సమాచారం. తిరుపతి లోక్సభ సభ్యుడు, దివంగత బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి ఒక టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే- ఎమ్మెల్సీగా ఉంటూ కన్నుమూసిన కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణా రెడ్డి కుమారుడిని కూడా శాసన మండలికి పంపిస్తారని సమాచారం.
బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడు కల్యాణ్ చక్రవర్తి, చల్లా రామకృష్ణా రెడ్డి కుమారుడు భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్లు దాదాపు ఖరారైనట్టేనని పార్టీ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. తిరుపతి ఉప ఎన్నిక బరి నుంచి బల్లి కల్యాణ్ చక్రవర్తి స్వచ్ఛందంగా తప్పుకొన్నందున ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఖాయం చేశారని సమాచారం.
మిగిలిన స్థానాల్లో మర్రి రాజశేఖర్.. కొయ్యె మోషెన్ రాజు
మిగిలిన నాలుగు స్థానాల కోసం గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యె మోషేన్ రాజు పేర్లు బలంగా వినిపిస్తోన్నాయి. ఇదివరకే వారిద్దరినీ శాసన మండలికి పంపిస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ.. కుదరలేదు. సమీకరణాలతో పాటు పేర్లు కూడా మారిపోయాయి.
కడప జిల్లాకు చెందిన జకియా ఖానుంను ఎంపిక చేసింది వైసీపీ అగ్ర నాయకత్వం. ఈ సారి మర్రి రాజశేఖర్, కొయ్యె మోషెన్ రాజులకు తప్పనిసరిగా అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ పోటీ చేయలేదు. తాను పోటీ చేయాల్సిన చిలకలూరి పేట స్థానాన్ని విడదల రజినీ కోసం త్యాగం చేశారు.
ఆమంచికీ ఛాన్స్?
సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆమంచికి మండలి టికెట్ ఇవ్వడం వల్ల చీరాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను నియంత్రించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అదే జిల్లాకు పోతుల సునీతకు ఇప్పటికే ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందున.. మరోసారి అదే జిల్లాకు అవకాశం ఇవ్వకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. అసమ్మతిని, గ్రూపు రాజకీయాలను చల్లార్చడంలో భాగంగా ఆమంచికి మండలికి పంపిస్తారని తెలుస్తోంది.