అన్నలు టీడీపీలో..తమ్ముళ్లు వైఎస్ఆర్ సీపీలో: సరికొత్త సమీకరణాలు..ముంచుతాయా? తేల్చుతాయా?
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ ఫిరాయింపులు సహజమే అయినప్పటికీ.. అధికార పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల కుటుంబీకులు ప్రతిపక్ష పార్టీ వైపు మొగ్గు చూపించడం మాత్రం కొత్తే. రొటీన్ కు భిన్నమైనదే. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. సుమారు అరడజను మందికి పైగా సీనియర్ నాయకుల కుటుంబీకులు ప్రతిపక్షంలో చేరుతున్నారు. తాజాగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ఆర్ సీపీలో చేరడంతో ఫిరాయింపుల పర్వం పతాక స్థాయికి చేరినట్టయింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయానికి ఇలాంటివే మరిన్ని చేరికలు లేకపోలేదు.
ఈ జాబితాలో సోమిరెడ్డి ఒక్కరే కాదు..హోమ్ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వంటి హేమాహేమీలు ఉన్నారు. తమ సొంత కుటుంబ సభ్యులను వాళ్లు సొంత పార్టీలో చేర్చుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటున్నారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుడు సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తన అన్న రాజకీయ ప్రత్యర్థి, సర్వేపల్లి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డితో సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి చేతులు కలిపారు. కాకాణి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. మంత్రిగా తన సోదరుడు చంద్రమోహన్ రెడ్డి చేస్తోన్న అవినీతిని భరించలేకే తాను ప్రతిపక్ష పార్టీలో చేరానని ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
కొద్దిరోజుల కిందటి వరకూ ఎమ్మెల్సీగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున సర్వేపల్లి నుంచి పోటీ చేసిన ఆయన మూడుసార్లూ ఓడిపోయారు. అయినప్పటికీ.. చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. శాసన మండలికి పంపించి, మంత్రివర్గంలో చోటు కల్పించారు. సర్వేపల్లిలో సరైన అభ్యర్థి లేకపోవడం వల్ల చంద్రబాబుకు సోమిరెడ్డి తప్ప మరో మార్గం కనిపించలేదు.
మరోసారి ఆయననే సర్వేపల్లి అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు. దీనికోసం- ముందస్తుగా మండలి సభ్యత్వానికి సోమిరెడ్డి రాజీనామా చేశారు. అదే సమయంలో బావ రామకోట సుబ్బారెడ్డి, సోదరుడు సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్ సీపీలో చేరడం.. ఊహించని పరిణామం.
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు గత ఏడాది వైఎస్ఆర్ సీపీ కండువా కప్పుకొన్నారు. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా బుద్ధా నాగేశ్వరరావు ఆయనను కలుసుకున్నారు. జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఆయన సోదరుడు, కృష్ణా జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు వర్ల రత్నం కూడా ఇటీవలే వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు లక్ష్మణరావు టీడీపీని వీడటానికి రెడీ అయ్యారని చెబుతున్నారు. ఆయన జనసేన పార్టీలో చేరడానికి ముహూర్తం చూసుకుంటున్నారట. ఈ నెల 28వ తేదీన టీడీపీలో చేరబోతున్నట్లు ఇదివరకే ప్రకటించిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి.. అదే బాటలో నడిచారు.
కాంగ్రెస్ పార్టీని వీడిన హర్షవర్ధన్ రెడ్డి.. వైఎస్ఆర్ సీపీలో చేరారు. తన వెంట పెద్ద ఎత్తున అనుచరులు, కార్యకర్తలను తీసుకుని వెళ్లారు.వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు గానీ, ఫలితాలు గానీ ఎలా ఉంటాయో తెలియదు. టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఫర్వాలేదని, రాకపోతే..అప్పటికే వైఎస్ఆర్ సీపీలో చేరిన తమ కుటుంబ సభ్యుల ద్వారా తమకు కావాల్సిన పనులు పూర్తి చేయించుకోవచ్చనేది సీనియర్ల వ్యూహంగా తెలుస్తోంది.