టీడీపీలో మేథోమధనం..! సీనియర్ నేతల మనుగడ అగమ్యగోచరం..!!
అమరావతి/హైదరాబాద్ : 2019 సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం పార్ఠీని కుదిపేస్తున్నాయి. విజయంతో తమ రాజకీయ జీవితానికి ముగింపు పలుకుదామనుకున్న సీనియర్లకు ఈ ఎన్నికలు శరాఘాతంగా మారాయి. మొత్తం ఏపితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలోని పలువురు సీనియర్ల కెరీర్ కు ఈ ఎన్నికలు చరమగీతం పాడేశాయి. ఈసారి ఎట్టిపరిస్థితిలోనూ పోటీ చేయనని చెప్పిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బలవంతంగా పోటీ చేశారు. అంతా అనుకున్నట్లుగానే ఆయన పరాజయం పాలైయ్యారు. ఏకంగా 22 వేల భారీ తేడాతో వైసీపీ అభ్యర్ధి పెట్ల ఉమా శంకర్ గణేష్ చేతిలో ఓడిపోయారు. దీంతో ఆయనతో పాటు మరి కొంత మంది సీనియర్ నేతల రాజకీయ భవిత ప్రశ్నార్ధకంగా మారింది.
సీనియర్లకు శరాఘాతం..! దెబ్బకొట్టిన 2019ఎన్నికలు..!!
ఒకనాటి తన శిష్యుడు, టీడీపీలో అనుచరుడు అయిన గణేష్ చేతిలో అయ్యన్న ఓడిపోవడం ఆయన రాజకీయ జీవితానికి బ్రేక్ పడేలా చేసింది. ఇప్పటికి తొమ్మిది సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచిన అయ్యన్న మూడుసార్లు ఓటమి పాలు అయ్యారు. అయితే ఇంతటి భారీ తేడాతో ఓడిపోవడం మాత్రం ఇదే తొలిసారి. ఈ దెబ్బతో అయ్యన్న రాజకీయాలకు గుడ్ బై చెబుతారనే చర్చ జోరుగా సాగుతోంది.
అంధ కారంలో సీనియర్ల భవిత..! విషాద ముగింపు తప్పదా..!!
ఇక పెందుర్తికి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వైసీపీకి చెందిన యువకుడు, పెద్దగా రాజకీయ అనుభవం లేని అన్నంరెడ్డి అదీప్ రాజ్ చేతిలో ఓటమి పాలైయ్యారు. మూడున్నర దశాబ్దాలుగా రాజకీయ జీవితాన్ని కొనసాగించిన బండారు ఈసారి తన కుమారుడికి టికెట్ అడిగారు. అయితే చంద్రబాబు ఆయన్నే పోటీకి దింపారు. అయినా అయనకు ఓటమి తప్పలేదు. 1998 సమయంలో మునిసిపల్ శాఖా మంత్రిగా కూడా పనిచేసిన బండారు రాజకీయ జీవితం ఇపుడు ముగిసిపోయినట్లేనని అంటున్నారు.
మంత్రి అవ్వాలనుకున్న సీనియర్లు..! ప్రజా తీర్పుతో ఖంగుతిన్న నాయకులు..!!
మరోమారు గెలిచి మంత్రి అవ్వాలని ఆశ పడిన ఆయనకు ఆ కోరిక తీరకుండానే పొలిటికల్ కెరీర్ క్లోజ్ కావడం విషాద పరిణానం. విజయనగరంలో 86 ఏళ్ల కురువృధ్ధుడు పతివాడ నారాయణస్వామి సైతం తన కొడుక్కి టికెట్ ఇమ్మని ఆడిగారు. అయితే హై కమాండ్ నో అనడంతో నెల్లిమర్ల నుంచి పోటీకి దిగారు. దాంతో భారీ తేడాతో ఆయన్ని వైసీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే బండుపల్లి అప్పలనాయుడు ఓడించేశారు.
వయసు మీద పడుతోంది..! వచ్చే ఎన్నికల వరకు ఓపిక ఉంటుందా..?
ఇక పతివాడ కధ ముగిసినట్లేనని అంటున్నారు. ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి కిమిడి మృణాళినితో పాటు, శత్రుచర్ల విజయరామరాజు వంటి వారి కెరీర్ కూడా ఈసారితో సరి అంటున్నారు. అదే విధంగా శ్రీకాకుళంలో మంత్రి కిమిడి కళా వెంకటరావు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గౌతు శ్యామ సుందర శివాజీ కుటుంబం కూడా ఈసారి ఓటమి పాలు అయింది. మరి ఈ కుటుంబాలు మళ్ళీ రాజకీయంగా రాణిస్తాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.