ఏందప్పా..బైరెడ్డి! ఇట్టా చేస్తాంటివి..మళ్లా పార్టీ మారతా ఉండావా?
కర్నూలు: కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి పార్టీ వీడబోతున్నారనే వార్త గుప్పుమంది. ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని రెండేళ్లు కూడా కాలేదు. అప్పుడే.. మరో పార్టీని వెదుక్కునే పనిలో పడ్డారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో తలెత్తిన విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. కాంగ్రెస్ ను వీడటం దాదాపు ఖాయమైందని, ఏ పార్టీలో చేరాలనే విషయంపై తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
కిడారికి పట్టిన గతే మీకూ పడుతుంది: ఎమ్మెల్యే యరపతినేనికి మావోయిస్టుల బహిరంగ లేఖ
జిల్లా రాజకీయాల్లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఓ వెలుగు వెలిగారు. తెలుగుదేశం పార్టీ 1994, 1999 లోనే ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున నందికొట్కూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. వరుసగా రెండుసార్లు గెలిచారు. 2004 ఎన్నికల్లో గౌరు చరితా రెడ్డి చేతిలో ఓడిపోయిన తరువాత బైరెడ్డి తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడాన్ని నిరసిస్తూ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ నుంచి బయటికి వచ్చారు.
అనంతరం- సొంతంగా రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో పార్టీని స్థాపించారు. ట్రాక్టర్ మీద రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. అయినప్పటికీ.. ఆయన చాలినంత చాలినంత ప్రజా బలాన్ని కూడగట్టుకోలేకపోయారు. 2014లో ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు కావడంతో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. విభజన తరువాత రాయలసీమ విమోచన సమితి జెండా కింద పలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. ప్రజల మద్దతును పొందలేకపోయారు. దీనితో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.
తాజాగా- ఆ పార్టీ సీనియర్లతో విభేదాలు తలెత్తాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో బైరెడ్డి, రఘువీరా రెడ్డి మధ్య పొరపచ్చాలు తల్తెతాయి. అవి తెగే దాకా వెళ్లాయి. తాను కాంగ్రెస్ లో ఇమడలేకపోతున్నానని బైరెడ్డి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో తన అనుచరులతో సమావేశం అవుతారని, భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.