వచ్చే ఎన్నికల్లో మార్పు ఖాయం!...ఎపి రాజకీయాలపై సీనియర్ నేత హరి రామజోగయ్య సంచలన వ్యాఖ్యలు
పశ్చిమగోదావరి:సంచలన రాజకీయ నేతల్లో ఒకరైన సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎంపి హరిరామ జోగయ్య మరో సారి షాకింగ్ కామెంట్స్ చేశారు. పాలకొల్లులోని తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో విశ్లేషణ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కాలంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయపడిన హరిరామజోగయ్య వచ్చే ఎన్నికలలో ఈ మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయని జోస్యం చెప్పారు. అంతేకాదు సుమారు నాలుగు సంవత్సరాల పాటు కలిసి ప్రయాణం చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు నేడు ప్రత్యర్థులుగా మారాయని...ఈ పరిస్థితే అనేక మార్పులకు దారితీస్తోందన్నారు.
మిత్రుల నుండి శత్రువులుగా మారిన ఈ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు కురిపించుకుంటున్నారన్నారు. దశాబ్దాల కాలం నుంచి బద్ద విరోధులుగా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మిత్రులుగా మారి చెత్త రాజకీయాలకు తెరతీయబోతున్నారని హరిరామ జోగయ్య విమర్శించారు. కర్మదేశం పేరుతో తెలుగుదేశం.. పాదయాత్ర పేరుతో వైఎస్సార్సిపి, ప్రజా పోరాట యాత్ర పేరుతో జనసేన ప్రజల ముందుకు వెళుతూ తమ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఈ మూడు పార్టీల భవిష్యత్తు ఏమిటో తేల్చాల్సింది...తేల్చేది ప్రజలేనని...2019 సంవత్సరం ఇందుకు వేదిక కానుందని ఎపి సీనియర్ పొలిటీషియన్ అయిన చేగొండి వెంకట హరి రామజోగయ్య విశ్లేషించారు. రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడైన హరిరామ జోగయ్య కొంతకాలంగా స్థబ్ధుగా ఉంటున్న నేపథ్యంలో...హఠాత్తుగా ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గతంలో చిరంజీవి గట్టి మద్దతుదారుడైన హరిరామ జోగయ్య ఆ తరువాత కాలంలో తాను రచించిన ఆటోబయోగ్రఫీ పుస్తకంలో అదే చిరంజీవి మీద తీవ్ర విమర్శలు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి హరిరామజోగయ్య యాక్టివ్ గా మారడంతో ముందు ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని వివిధ పార్టీల నేతల్లో చర్చనీయాంశంగా మారారు.