మేం పోటీ చేయకపోవడం వల్లే వైసీపీకి ఘన విజయం: వ్యవస్థలను మేనేజ్ చేశారు..: టీడీపీ
అమరావతి: రాష్ట్రంలో వెలువడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తోన్నారు. మీడియా ముందుకొస్తోన్నారు. ఈ ఎన్నికలు అసలు ఎన్నికలే కావని తేల్చి చెబుతున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేసి గెలిచిందని ఆరోపిస్తోన్నారు. తాము జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించడం వల్లే వైసీపీకి ఘన విజయం దక్కిందని, తాము పోటీ చేసి ఉంటే.. ఈ స్థాయి విజయాన్ని అధికార పార్టీ అందుకునేది కాదని స్పష్టం చేస్తోన్నారు.
సీఎం సీటును అమ్ముకోవాల్సి వస్తుందని భయమా: కేసీఆర్పై షర్మిల ఫైర్: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా పరాజయం పాలైన తరువాత. ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన అన్ని చోట్లా ఓడిపోయారు. 90 శాతానికి పైగా ఓటుబ్యాంకును కోల్పోయారు. అధికార వైస్సాఆర్సీపీ విజయదుందుభి మోగించింది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో సాధించిన గెలుపును జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కొనసాగించింది.
ఈ ఎన్నికలను తాము బహిష్కరించామని ముందు నుంచీ చెబుతూ వస్తోన్నామని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. వైసీపీ ఈ తరహా విజయాన్ని సాధిస్తుందని తాము ముందే ఊహించామని పేర్కొన్నారు. అవి ఎన్నికలు కావని, ఎంపికలు మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించివేసి, ఈ ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచిందని ధ్వజమెత్తారు.
ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం లేకపోవడం వల్లే తాము ఈ ఎన్నికల్లో నామమాత్రంగా పోటీ చేశామని పేర్కొన్నారు. బహిష్కరణ చేసిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడటం ఏమిటని ప్రశ్నించారు. దీన్ని ఏకపక్ష పోటీగా అభివర్ణించుకోవడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు.
ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కిన ఈ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా తాము ఎప్పుడో ఈ ఎన్నికలను బహిష్కరించామని అన్నారు. వ్యవస్థలన్నింటినీ వైసీపీ సర్వనాశనం చేసిందని, మేనేజ్ చేసి విజయం సాధించిందని చెప్పారు. ఎన్నికలు ప్రహసనంగా మార్చేశారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నాయకులను ప్రజలు ఛీత్కరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లాలని నక్కా ఆనంద్ బాబు సవాల్ చేశారు.