వెంబడించి చిత్రహింసలు: సీనియర్ల దాడిలో స్పృహతప్పిన బీటెక్ విద్యార్థి
తాడేపల్లి గూడెం మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నవిద్యార్థిపై అదే కళాశాలలో చదువుతున్న సీనియర్లు తీవ్రంగా దాడి చేశారు. దీంతో అతడు స్పృహతప్పిపడిపోయాడు.
పశ్చిమగోదావరి: తాడేపల్లి గూడెం మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నవిద్యార్థిపై అదే కళాశాలలో చదువుతున్న సీనియర్లు తీవ్రంగా దాడి చేశారు. దీంతో అతడు స్పృహతప్పిపడిపోయాడు. ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న బి.ప్రవీణ్కుమార్ను, అదే కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థులు స్పృహ తప్పేలా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు వివరాల మేరకు.. మణికంఠ అనే విద్యార్థి 15 రోజుల క్రితం ప్రవీణ్కుమార్ సెల్ఫోన్ తీసుకున్నాడు. అది ఇవ్వాలని అడిగితే శుక్రవారం కళాశాలకు మణికంఠ తన అన్నయ్యను తీసుకొచ్చాడు.
వీరిద్దరితోపాటు సీనియర్ విద్యార్థులు కొందరు ప్రవీణ్కుమార్ను కళాశాల పక్కనే ఉన్న జామాయిల్ తోటలోకి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తీసుకెళ్లారు. ల్యాప్ట్యాప్ దొంగిలించానని ఒప్పుకొంటే సెల్ఫోన్ ఇస్తామని ప్రవీణ్కుమార్ను బెదిరించారు. చేయని దొంగతనాన్ని తానెందుకు ఒప్పుకొంటానని ప్రవీణ్కుమార్ అనడంతో అతని ముఖంపై పడిగుద్దులు గుద్ది, నడుముపై, పొట్టపై కాళ్లతో తన్ని చిత్రహింసలకు గురిచేశారు.
చివరకు వారి బారి నుంచి తప్పించుకుని గ్రామంలోకి వచ్చినా ద్విచక్ర వాహనాలపై వెంబడించి పట్టుకుని మళ్లీ జామాయిల్ తోటలోకి బలవంతంగా తీసుకెళ్లారు. ఆపై సృహతప్పేలా దాడిచేసి.. పెదతాడేపల్లిలోనే ఉన్న తన ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయారని బాధితుడు తెలిపాడు. ప్రస్తుతం బాధితుడు స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రవీణ్కుమార్ తెలిపారు.