సంచలనం:టీటీడీపై బిజెపి ఎంపి సుబ్రమణ్యం స్వామి వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో తిరస్కరణ
న్యూ ఢిల్లీ:తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి బీజేపీ ఎంపి సుబ్రమణ్యస్వామి వేసిన ఒక పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. టీటీడీని ఏపీ ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలంటూ తాను వేసిన పిటిషన్ పై ఆయనే స్వయంగా వాదించారు.
అయితే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం...టిటిడి స్థానిక చట్టాల ఆధారంగా పనిచేస్తోందని, కాబట్టి ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే ఈ విషయమై మీరు హైకోర్టుకు వెళితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సూచించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై సుబ్రమణ్యస్వామి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే...
తిరుమల తిరుపతి దేవస్థానంని ఏపీ ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలంటూ సుప్రీం కోర్టులో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి, సత్య సభర్వాల్ పిటిషన్ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. టిటిడి వివాదం సందర్భంగా ఈ ఏడాది జూన్ లో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి మీడియాతో మాట్లాడుతూ టీటీడీని ఎపి ప్రభుత్వం నుంచి విముక్తి చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
ప్రధానార్చకుడు రమణ దీక్షితులును టిటిడి బలవంతంగా పదవీ విరమణ చేయించడం, అనంతరం రమణ దీక్షితులు స్థానంలో వేణుగోపాల దీక్షితులు ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు చేపట్టడం ఆఘమేఘాల మీద జరుగగా...ఆ క్రమంలో రమణ దీక్షితులు మాట్లాడుతూ తాను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసినందుకే తనను బాధితుడిని చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఆ నేపథ్యంలో ఈ వివాదం పలు మలుపులు తిరగగా...అదే క్రమంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి టిటిడి విషయమై పిల్ దాఖలు చేశారు. అలా దాఖలు కాబడ్డ పిల్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నట్లు సుబ్రహ్మణ్యం స్వామి ఆదివారం ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. తద్వారా ఈ విచారణ గురించి వెల్లడి కాగా... తాజాగా సోమవారం ఈ పిటిషన్ సుప్రీం కోర్టులో తిరస్కరణకు గురికావడం గమనార్హం.