సంచలనం:రాజమండ్రి సెంట్రల్ జైలులో దొంగ నోట్లు లభ్యం...అసలు అక్కడ ఏం జరుగుతోంది?
తూర్పుగోదావరి:రాజమండ్రి సెంట్రల్ జైలులో దొంగ నోట్ల కట్టలు లభించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ దొంగ నోట్లలో రూ. 2000, రూ.500, రూ.200, రూ.100 నోట్లు ఈ నాలుగు డినామినేషన్ల నోట్లు ఉండటం గమనార్హం. అయితే అసలు జైలులో దొంగ నోట్లు లభించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బైట నుంచి మార్పిడి కోసం ఈ దొంగ నోట్లకు జైలుకు తరలించారా?...లేక జైలులోనే ఈ నోట్లను ముద్రించడం వంటిదేదన్నా జరిగిందా?...ఇలా వివిధ కోణాల్లో ఈ ఘటనపై జైలు అధికారులు విచారణ జరుపుతున్నాయి. జైలులో ఖైదీల చేత వివిధ రకాల చేతి వృత్తి పనులు చేయించి...అందుకు గాను వారికి డబ్బుల చెల్లింపు జరుగుతుందన్న సంగతి తెలిసిందే...ఆ చెల్లింపులకు...ఈ నోట్లకు ఏమైనా సంబంధం ఉందా అనే యాంగిల్ ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
సెంట్రల్ జైలులో...దొంగ నోట్లు లభ్యం
స్థానిక రాజమండ్రి కేంద్ర కారాగారంలో దొంగ నోట్లు దొరకడం కలకలం రేపింది. చెత్తకుప్పల కింద ఈ నోట్లు లభించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. మెుత్తం రూ.68,700 విలువైన వివిధ డినామినేషన్ల 91 దొంగ నోట్లు లభ్యం కావడం పలు అనుమాలకు తావిస్తోంది. జైలు మధ్యలో ఇలా దొంగ నోట్లు లభ్యం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కష్టపడి పనిచేస్తే మంచి విందు...తప్పుడు పనులు చేస్తే కఠిన చర్యలు:అధికారులతో సిఎం చంద్రబాబు
ఆ తుక్కు కిందే...దొంగ నోట్ల కట్టలు
విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజమండ్రి జైలులో ఫర్నీచర్, బీరువాలు, డోర్ మ్యాట్లు, కుట్టు మిషన్లు, వస్త్రాల తయారీ వంటి పలు పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో ఖైదీలు పని చేయించడం చేస్తారు. కుట్టు పరిశ్రమలో సాంఘిక సంక్షేమ శాఖ, జైళ్ళ శాఖతో పాటుగా వివిధ శాఖలకు యూనిఫారాలు, చొక్కాలు, ప్యాంట్లు వంటివి కుడతారు. వీటి తయారీ క్రమంలో కటింగ్ చేసేప్పుడు వచ్చే వస్త్రాల ముక్కలు, రద్దు,తుక్కును ఈ పరిశ్రమ కాంపౌండ్ లోనే మెట్ల కింద పడేస్తున్నారు.
అనుకోకుండా...వెలుగులోకి
అయితే ఇటీవలే భారీగా పేరుకున్న ఈ తుక్కును గమనించిన జైలు సూపరింటెండెంట్ పీజీ సాయిరాం ప్రకాష్ ఆ రద్దును అక్కడ తొలగించి అక్కడ నూతనంగా మరో మిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన సిబ్బంది ఆ తుక్కును తరలిస్తుండగా ఒక కరెన్సీ నోట్ల దొంతర బయట పడింది. దానిని వార్డర్ త్రిమూర్తులు గుర్తించి వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. ముందు అవన్నీ అసలు నోట్లని భావించగా అ తరువాత అవన్నీ జిరాక్స్ తీసిన కరెన్సీ నోట్లుగా గుర్తించారు.
వివిధ డినామినేషన్ నోట్లు
వాటిలో రూ.2వేల నోట్లు 20, రూ.500 నోట్లు 53, రూ.200 నోట్లు 4, రూ.100 నోట్లు 14 ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.68,700 కాగా...వాటిలో 6 డీఎం633631 సిరీస్ రూ.200నోట్లు, 7డీఏ564594 సిరీస్ రూ.500నోట్లతో పాటుగా వివిధ సిరీస్ల నోట్లు ఉన్నాయి. అలాగే కొన్ని నోట్లు ఒకే సిరీస్కు ఒకే నంబర్ తో కూడా ఉన్నట్లు తెలిసింది. దీనిపై సూపరింటెండెంట్ సాయిరాం ప్రకాష్ను వివరణ కోరగా జిరాక్స్ నోట్లు ఎలా వచ్చాయో తెలియదని...విచారణ జరుపుతున్నామని చెప్పారు.
వివిధ కోణాల్లో...విచారణ
ఖైదీల వద్ద సిగరెట్, బీడీల వంటివి దొరికితే ఒక బాక్స్లో వేస్తామని, అలాగే ఈ నోట్లను కూడా ఆ బాక్స్ లోనే పడేశామన్నారు. తరువాత వాటిని కాల్చేస్తామని చెప్పారు. అయితే జైలు అధికారులు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం పై విస్మయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు ఈ విషయం బైటకు పొక్కి పై అధికారుల దృష్టికి వెళ్లడంతో...ఈ కరెన్సీ నోట్లు జిరాక్స్ ఎక్కడ తీశారు?...అవి లోపలికి ఎలా...ఎందుకోసం వచ్చాయి...వీటితో ఏం చేస్తున్నారు?...అసలు ఎన్నాళ్ళుగా ఈ తతంగం జరుగుతోంది?...దీనిలో ఖైదీల పాత్ర ఏమిటి... జైలు సిబ్బంది పాత్ర ఎంత?...అధికారుల సహకారం కూడా ఉందా?...ఈ కోణాల్లో విచారణ జరిపే అవకాశం ఉంది.