సంచలనం:చంద్రబాబుకు గడ్కరీ లేఖ...కలసి అక్కడ ఇంటర్నేషనల్ పోర్టు ఏర్పాటు చేద్దాం
అమరావతి:ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి అనూహ్యమైన లేఖ అందింది. ప్రకాశం జిల్లా ఓడరేవులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి సౌకర్యాలున్న పోర్టు ఏర్పాటు చేద్దామంటూ ఆ లేఖలో కేంద్రమంత్రి గడ్కరీ ప్రతిపాదించారు.
ఇందుకోసం ఎస్పీవీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్రమంత్రి గడ్కరీ కోరారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఈ మేరకు ప్రతిపాదనలు వస్తే అన్ని అనుమతులు తీసుకోవచ్చని ఆయన సూచించారు. ప్రకాశం జిల్లా ఓడరేవులో అంతర్జాతీయ స్థాయి పోర్టు ఏర్పాటుకు సౌకర్యాలు అనువుగా ఉన్నాయని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటే బాగుంటుందని గడ్కరీ సూచించినట్లు తెలిసింది.
ఇదిలావుండగా ప్రకాశం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వమే రామాయపట్నం పోర్టును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఆ క్రమంలో పోర్టు ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు సమాచారం. ఈ తరుణంలో ఓడరేవును కలసి ఏర్పాటు చేద్దామంటూ కేంద్రం నుంచి వచ్చిన లేఖను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ తరహా లేఖ రావడం మరీ అనూహ్యమేమీ కాకున్నా ఈ తరుణంలో ఇలాంటి లెటర్ ను మాత్రం ఊహించలేదని తెలుస్తోంది. చివరి కేంద్ర బడ్జెట్ లో కూడా ఎపికి అన్యాయం జరిగిన క్రమంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కోసం ఆందోళనలు హోరెత్తిన క్రమంలో రామాయపట్నం పోర్టు అంశం మళ్ళీ తెరమీదకొచ్చిన సంగతి తెలిసిందే. విభజన హామీలలో నెల్లూరు జిల్లా వాకాడు మండలంలోని దుగరాజపట్నం పోర్టు ఒకటి.
అయితే రక్షణ పరంగా "ఇస్రో" అభ్యంతరాలు, పులికాట్ సరస్సు పర్యావరణానికి ముప్పు రావచ్చనే నివేదికలతో ఈ పోర్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్న క్రమంలో దుగరాజపట్నం వద్ద పోర్టు నిర్మాణంపై అభ్యంతరాలున్నాయని, ప్రత్యామ్నాయ పోర్టును పరిశీలిస్తున్నామని అప్పట్లో కేంద్ర మంత్రి చెప్పడంతో ఆ క్రమంలో రామాయపట్నం మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. ప్రతిపక్షాలు రామాయపట్నం వద్ద పోర్టు నిర్మించాలని ఆందోళనలు చేయడం, అప్పటి కేంద్రమంత్రి, ఇప్పటి ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు దృష్టికి కూడా రామాయపట్నం అంశాన్ని తీసుకెళ్లడం కూడా జరిగింది. ఆ క్రమంలో కొన్ని నెలలు గడిచాక పోర్టు ఏర్పాటు విషయమై తాజాగా లేఖ రావడం రామాయపట్నం పోర్టు ఏర్పాటు దిశగా కీలకమైన పరిణామంగా చెప్పొచ్చు.