పెదనాన్న టిడిపి వైపు...కుమారుడు వైసిపి చూపు:జగన్ ను సిఎం చేసేందుకే అంటున్న వారసుడు
Recommended Video
కర్నూలు:ఒక వారసుడి ప్రకటనతో కర్నూలు జిల్లా రాజకీయాల్లో కలకలం రేగింది. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి సోదరుడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసిపిలో చేరనుండటమే ఈ కలకలానికి కారణం.
ఇందుకు ముహూర్తం కూడా ఖారారైంది. ఈనెల 7న పార్టీ అధినేత జగన్ సమక్షంలో సిద్దార్ధ రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. ఈ విషయమై సిద్దార్థ రెడ్డి కూడా నిర్థారించారు. అయితే జగన్ అంటేనే మండిపడే బైరెడ్డి కుటుంబం నుంచి సిద్దార్థరెడ్డి వైసీపీ వైపు వెళ్లడం కర్నూలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితిపై బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు తాను వైసిపి లో చేరే విషయం నిజమేనని అంగీకరించిన సిద్దార్థరెడ్డి తాను ఎందుకు ఆ పార్టీలో చేరుతున్నానో కూడా స్పష్టత ఇచ్చారు. తనకు బైరెడ్డి రాజశేఖరరెడ్డితో విభేదాలు లేవన్నారు. జగన్ను సీఎం చేసేందుకు తాను ఎవరితోనైనా కలసి పనిచేస్తానని చెప్పారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నందికొట్కూరులో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని సిద్దార్థరెడ్డి విమర్శించారు. తనపై అక్రమంగా కేసులు బనాయించారన్నారు. జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సిద్దార్థరెడ్డి తెలిపారు.
అయితే తొలుత పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్రెడ్డిని ఆదర్శంగా తీసుకుని సిద్దార్థరెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొంతకాలం పెద్దనాన్న బాటలో నడిచిన సిద్ధార్థరెడ్డి ఇప్పడు వేరే రూటులో వెళ్లేందుకు ఫిక్సయ్యారు. తన రాజకీయ భవితవ్యం దృష్ట్యా స్వీయ నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే వైసిపి లోకి వెళ్లేందుకు కొన్నాళ్లుగా వేచిచూస్తున్న సిద్దార్ధ రెడ్డి తనపై నమోదైన కేసుల కారణంగా కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే కడప జిల్లాలోని సమీప బంధువుల ద్వారా వైసీపీలోకి వేళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు.
అయితే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన సోదరుడి కుమారుడే వైసిపిలో చేరుతుండటంపై వారి కుటుంబం, అనుచరవర్గం,మద్దతుదారులతో పాటు కర్నూలు జిల్లా రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి త్వరలోనే టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. దీంతో పెదనాన్న అధికార పార్టీలో...కుమారుడు ప్రతిపక్షంలో చేరనుండటం ఆసక్తికరంగా మారింది.