సంచలనం:అరకులో మళ్లీ కనిపించిన మావోయిస్టులు...మరొకరి గురించి ఆరా!;అంతటా ఆందోళన
విశాఖపట్టణం:ఇటీవలి మావోయిస్టుల దాడితో అసలే బిక్కుబిక్కుమంటున్న అరకు తాజాగా వినవస్తున్న మరో సమాచారంతో మరింత భీతిల్లుతోంది. అరకు ప్రాంతంలో మళ్లీ మావోయిస్టులు కనిపించారని...ఒక వ్యక్తి గురించి వాకబు చేశారన్నదే ఆ సమాచారం.
మావోయిస్టులు ఇంకా లేఖ ఎందుకు విడుదల చేయలేదు?...ఆ లేఖ కోసం సర్వత్రా ఆసక్తి
మావోయిస్టులు ఆరా తీసిన ఆ వ్యక్తి ఎంపిపి అని తెలుస్తోంది. దీనికి తోడు ఆ ఎంపిపి కుటుంబీకులు కూడా తమకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని అంగీకరించడంతో పాటు ఇటీవలి ఎమ్మెల్యే కిడారి పై దాడి సందర్భంగా కూడా మావోలు ఎంపిపి గురించి అడిగారని తెలిసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతం ద్వారా మావోయిస్టుల సంచారం నిజమేననే నమ్మకం బలపడటంతో స్థానికులు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. వివరాల్లోకి వెళితే...
ఆ బస్ షెల్టర్...ఇక్కడే ఆరా
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత మార్చి వారం రోజులు కూడా కాలేదు...అప్పుడే మావోయిస్టులు మరో దాడికి సిద్దమవుతున్నారా?...అంటే అవుననే నిర్థారిస్తోంది తాజా సమాచారం. అరకుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంజిపూర్ బస్ షెల్టర్ వద్ద రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక యువకుడు నిలబడి ఉండగా ముగ్గురు వ్యక్తులు అతనివద్దకు వచ్చి అరకు ఎంపీపీ, టీడీపీ నాయకుడు అప్పాలు ఇల్లు ఎక్కడో తెలుసా?...అని అడిగారట.
బ్యాగులు...ఆయుధాలు
అలా అడిగిన ఆ ముగ్గురు వ్యక్తులను చీకట్లో తేరిచూడగా వారి చేతిలో వాటర్ బాటిల్...వీపుకు బ్యాగులు...చేతిలో ఆయధాల వంటివి కనిపించడంతో భయంతో వణికిపోయిన ఆ యువకుడు తనకు ఇక్కడ ఎవరూ తెలియదని చెప్పి అక్కడ నుంచి వచ్చేశాడట. ఆ తరువాత అతడు నేరుగా ఎంపిపి ఇంటికి వెళ్లి ఎంపీపీ అప్పాలుకు, అతడి భార్య అరుణకుమారికి ఈ విషయం తెలియజేశాడట.
ఎంపిపికి...సమాచారం చేరింది
చెమటలు కక్కుతూ తీవ్ర ఆందోళనతో పరుగులు పెడుతూ వచ్చిన ఆ యువకుడిని చూసి ఎంపిపి ఏమైందని ప్రశ్నించగా, మీ కోసం మావోయిస్టులు వచ్చారని, తప్పించుకొని ఎటైనా పారిపోవాలని సూచించాడట. వచ్చిన ముగ్గురిలో ఇద్దరు మహిళలని వివరించాడట. దీంతో భయపడిన ఎంపీపీ భార్య అరుణకుమారి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. దీనికి స్పందించిన అరకు సీఐ వెంకునాయుడు, ఏఎస్పీ రస్తోగి విషయం చెప్పగా వారు హుటాహుటిన బెంజిపూర్లోని ఎంపీపీ ఇంటికి వెళ్లారని తెలిసింది.
నిజమైతే...పెను ప్రమాదమే!
అక్కడ జరిగిన విషయం గురించి తెలుసుకొని, ఆమె భర్త అప్పాలును, విషయం గురించి తెలిపిన యువకుడిని వెంటబెట్టుకొని తీసుకొని వెళ్లారట. ఈ సంగతి తెలిసి మీడియా ప్రతినిథులు బెంజిపూర్ వెళ్లి ఎంపీపీ అరుణకుమారిని కలిసి ఈ విషయం గురించి ఆరా తీయగా ఆమె వమావోల ఆరా వాస్తవమేనని తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారని తెలిసింది. మొన్న ఆదివారం ఎమ్మెల్యే కిడారిపై దాని చంపినప్పుడు కూడా మావోయిస్టులు ఎంపిపి అప్పాలు గురించి అక్కడ ఆరా తీశారని తెలిసిందని, భయంగా వుందని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె కోరినట్లు సమాచారం. అయితే నిజంగానే మావోయిస్టుల సంచారం ఉందా...లేక ఆ యువకుడు పొరబడ్డాడా?...అనేది పోలీసులే తేల్చాల్సి ఉంది. ఒకవేళ మావోల సంచారం నిజమైన పక్షంలో ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.