అమరావతిపై జగన్ పునరాలోచన..!!? ప్రభుత్వ స్వరంలో మార్పు..త్వరలో కీలక ప్రకటన..!!
ఏపీ రాజధాని అమరావతి భవితవ్యం ఏంటి. ముఖ్యమంత్రి జగన్ రాజధాని నిర్మాణం పైన పునరాలోచనలో ఉన్నారా. రాజధాని తరలించేది లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, తాజాగా ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. మంత్రుల వ్యాఖ్మలతో కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు విస్పష్ట సమాచారం. అమరావతిలోనే రాజధాని కొనసాగిస్తూనే..పరిధి విషయంలో పునరాలోచన చేస్తున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి. తాజాగా మున్సిపల్ మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సైతం దీనికి ఊతం ఇస్తున్నాయి. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని.. త్వరలోనే దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని బొత్సా ప్రకటించారు. అదే సమయంలో నిర్మాణ వ్యయం..ముంపు సమస్య గురించి ప్రస్తావించారు. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ కీలక నేత విజయ సాయిరెడ్డి చేసిన ట్వీట్ లోనూ ఇదే కామెంట్ చేసారు. దీని ద్వారా..రాజధానిపైన ప్రభుత్వం ఆలోచనలో మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయి..ఇంతకీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..
బొత్సా వ్యాఖ్యల పరమార్దం ఏంటి...
ఏపీ ప్రభుత్వంలో కీలక మంత్రి..మున్సిపల్ వ్యవహారాలతో పాటుగా రాజధాని అంశాన్ని పర్యవేక్షిస్తున్న బొత్సా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని..త్వరలో దీనిపై ప్రకన చేస్తామని బొత్సా స్పష్టం చేసారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తేల్చి చెప్పారు. ఎప్పుడో నిర్ణయించిన రాజధాని పైన ఇప్పుడు ప్రభుత్వంలో చర్చ అంటే ఏంటనేదే ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అమరావతిలో దాదాపు నిర్మాణాలు ఆగిపోయాయి. ఇక్కడ నిర్మాణాల పైన అధ్యయన కమిటీ నియమించారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ వ్యయం కంటే ఎక్కువ అవుతోందని ఈ సందర్భంగా బొత్స అన్నారు. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగమవుతోందని పేర్కొన్నారు. ఇటీవల సంభవించిన వరదలతో అక్కడ ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయని తెలిసిందని, దీని నుంచి రక్షణ పొందేందుకు కాల్వలు, డ్యామ్లు నిర్మించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడనుందని, దాంతో ప్రజాధనం వృథా అవుతుందని బొత్స వివరించారు. వరద నీటిని ప్రత్యేకంగా తోడి బయటకు పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా అమరావతిలో ఇప్పుడు రాజధానిగా ఎంచుకున్న ప్రాంతం సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకూ త్వరలోనే అమరావతిలో నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి స్వరంలో మార్పు పైన ఇప్పుడు అనేక అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయ సాయిరెడ్డి వ్యాఖ్యల్లోనూ ఇదే రకంగా..
ప్రభుత్వంలో ఉద్దేశ పూర్వకమో..యాధ్రుచ్చికమో కానీ..మంత్రి బొత్సా ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తే..పార్టీ ముఖ్య నేత విజయ సాయి రెడ్డి సైతం తన ట్వీట్ లో ఇదే అర్దం వచ్చేలా వ్యాఖ్యలు చేసారు. సాయి రెడ్డి తన ట్వీట్ లో ..అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని రేపు కేంద్రం ఆరా తీస్తుంది. ప్రజలూ ప్రశ్నిస్తారు అంటూ ట్వీట్ చేసారు. దాదాపుగా బొత్సా..సాయిరెడ్డి అభిప్రాయాలు ఒకే రకంగా ఒకే రోజు వ్యక్తం చేసారు. దీని ద్వారా రాజధాని మీద ప్రభుత్వంలో అంతర్గతంగా ఏదో కీలక నిర్ణయం చేయబోతున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. రాజధాని అమరావతి నుండి తరలించేది లేదని ఇప్పటికే స్పష్టం చేయటంతో..మరి ప్రభుత్వం తాజా నిర్ణయం ఏంటనేది చర్చకు కారణమైంది. రాజధాని లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. భారీ స్కాం అంటూ స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. ఇదే విషయాన్ని కేంద్రానికి నివేదించారు. ఇక్కడ జరిగిన భూ కేటాయింపుల మీద అధ్యయనం చేస్తున్నారు. అసలు ఇంత పెద్ద మొత్తంలో భూ సమీకరణ అవసరం లేదనేది వైసీపీ తొలి నుండి చెబుతున్న విషయం. దీంతో..ఇప్పుడు రాజధాని విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దాని పైన జగన్ ఫోకస్ చేసారని చెబుతున్నారు. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత దీని పైన కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.
పరిధి తగ్గింపు..అధికార వికేంద్రీకరణ..!!?
అయితే, ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు రాజధానిలో ముంపు ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకొని రాజధాని పరిధిని కుదిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం సీఆర్డీఏ పరిధిని రాజధాని ప్రాంతంగా ఖరారు చేసారు. దాదాపు 23 గ్రామాల ప్రజలు రాజధాని కోసం భూములు ఇచ్చారు. ముంపుకు అవకాశం లేని ప్రాంతం వరకే రాజధాని పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో నిర్మాణాలకు ఆర్దిక కష్టాలు లేకుండా ఏం చేయాలనే దాని పైనా..భూములను ఎలా వినియోగించుకోవాలనే దాని పైన కసరత్తు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ భూముల ద్వారా ప్రభుత్వం వద్ద రెండు లక్షల కోట్ల విలువైన ఆస్తి ఉందని చెప్పుకొచ్చారు. కానీ, జగన్ ఆలోచన మాత్రం మరోలా కనిపిస్తోంది. గత ప్రభుత్వం రాజధాని కేంద్రంగానే అన్ని ప్రధాన కార్యాలయాలు..సంస్థల ఏర్పాటు దిశగా ఆలోచన చేసింది. కానీ, జగన్ ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. అధికార వికేంద్రీకరణ జరగక పోవటం.. డెవలప్ మెంట్ మొత్తం ఒకే చోట ఉంటే ఇతర ప్రాంతాల ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని జగన్ పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో.. రాష్ట్ర స్థాయి కార్యాలయాలు.. ముఖ్య కేంద్రాలు మొత్త 13 జిల్లాల్లోనూ ఉండేలా వికేంద్రీకరణ చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటన ఉంటుందని సమాచారం. కేంద్రంతో సంప్రదింపులు తరువాత జగన్ ఈ ప్రకటన చేస్తారని చెబుతున్నారు. దీంతో..త్వరలోనే ఏపీ లో పాలనా పరంగా కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.