వామ్మో..కేశవ్ గెలుస్తున్నారా: టిడిపిలో మొదలైన కొత్త టెన్షన్: అధికారానికి ఇక దూరమేనా..!
పయ్యావుల కేశవ్. టిడిపిలో ప్రతీ ఒక్కిరికీ తెలిసిన వ్యక్తి. అనంతపురం జిల్లా లోని ఉరవకొండ నుండి ప్రస్తుత ఎన్నికల్లో టిడిపి అభ్యర్దిగా బరిలో ఉన్నారు. ఇప్పుడు పోలింగ్ ముగిసింది. మాది గెలుపు అంటే..మాది గెలుపు అంటూ టిడిపి..వైసిపి నేతలు పోటీ పడుతున్నారు. ఇదే సమయంలో టిడిపిలో కొత్త టెన్షన్ మొదలైంది. ఏంటీ...పయ్యావుల కేశవ్ గెలుస్తున్నారా..వామ్మో అంటున్నారు..ఎందుకంటే...
ఉరవకొండ నుండి కేశవ్ పోటీ..
పయ్యవుల కేశవ్ కుటుంబం తొలి నుండి రాజకీయాల్లో ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ టిడిపి అధినేత చంద్రబాబుకు విధేయుడు. కేశవ్ తండ్రి వెంకట నారాయణ ఇదే జిల్లా రాయదుర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యే గా గెలిచారు. పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుండి మూడు సార్లు గెలవగా..రెండు సార్లు ఓడిపోయారు. ఇక, 2014 ఎన్నిక ల్లో కేశవ్ ఓడినా ..టిడిపి అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో కేశవ్ పైన పోటీ చేసిన వైసిపి అభ్యర్ది విశ్వేశ్వరరెడ్డి 2275 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత టిడిపి అధినేత చంద్రబాబు కేశవ్కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి..శాసన మండలిలో చీఫ్ విప్గా నియమించారు. రాజకీయంగా వాగ్దాటి ఉన్న కేశవ్ కు మంత్రి అవ్వాలనేది చిరకాల కోరిక. అయితే, ఆయన గెలుపు..ప్రభుత్వం ఏర్పాటుకు సెంటిమెంట్ గా కలిసి రావటం లేదు. ఇక, తాజా ఎన్నికల్లోనూ ఇప్పుడు అదే చర్చ టిడిపిలో కొత్త టెన్షన్కు కారణమవుతోంది.
కేశవ్ గెలిస్తే..వామ్మో..
ఉరవకొండ నుండి తాజా ఎన్నికల్లో మరో సారి టిడిపి అభ్యర్దిగా పయ్యావుల కేశవ్ బరిలో దిగారు. 2014లో ఓడిన నాటి నుండే కేశవ్ 2019 ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు అమలు చేసారు. ఇక, అక్కడ వైసిపి నుండి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విశ్వేశ్వర రెడ్డిని బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య హోరా హోరీ పోరు సాగింది. ఈ ఎన్నికల్లో టిడిపి నేతలు ఉరవకొండ నుండి ఖచ్చితంగా కేశవ్ గెలుస్తారనే ధీమాతో ఉన్నారు. అదే సమయంలో..రాష్ట్ర నేతలు మాత్రం వామ్మో..కేశవ్ గెలుస్తున్నారా అంటూ టెన్షన్ పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే...ఉరవకొండలో గెలిచే అభ్యర్ది పార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉంది. ఇక్కడ, 1999 లో కాంగ్రెస్ అభ్యర్ది శివరామిరెడ్డి గెలిచారు. అయితే ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. 2004,2009 లో కేశవ్ గెలుపొందారు. రెండు సార్లు టిడిపి అధికారంలో లేదు. 2014 లో వైసిపి అభ్యర్ది విశ్వేశ్వర రెడ్డి గెలిచారు. వైసిపి ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇక, ఇప్పుడు ఈ ఎన్నికల్లో కేశవ్ గెలుస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నా..అదే సమయంలో పార్టీ అధికారంతో సెంటిమెంట్ ముడి పడి ఉండటంతో దాని పైనా టిడిపి నేతలు టెన్షన్ ఫీలవుతున్నారు.
అధికారంలోకి వస్తే మంత్రిగా..
ఈ ఎన్నికల్లో జిల్లా టిడిపి నేతలు అంచనా వేస్తున్నట్లుగా కేశవ్ గెలిచి..టిడిపి అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కు తుందనే అంచనాలో కేశవ్ వర్గీయులు ఉన్నారు. నారాయణ, యనమల, లోకేశ్ లాంటి వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. సోమిరెడ్డి పోటీ చేసినా ఓడారు. అయితే, 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత వీరికి మంత్రి పదవులు దక్కాయి. ఇక, కేశవ్ను సైతం ఎమ్మెల్సీగా చేసినా..మంత్రి పదవి ఇవ్వలేదు. అనంతపురం జిల్లా నుండి కేశవ్ సామాజిక వర్గానికే చెందిన పరిటాల సునీతకు మంత్రి పదవి ఇవ్వటంతో కేశవ్కు అవకాశం దక్కలేదు. ఈ సారి పార్టీ అధికారంలోకి వచ్చి..ఇక్కడ కేశవ్ గెలిస్తే మంత్రి ఖాయమని భావిస్తున్నారుద. అయితే, ఇక్కడ ఒకవేళ నిజంగా కేశవ్ గెలిచినా..పార్టీలో అధికారంలోకి రాకుంటే.. మరోసారి సెంటిమెంట్ వర్కవుట్ అయందనుకొని సర్దుకుపోవటం మినహా ఏం చేయగలమని టిడిపి నేతలు చెప్పుకొస్తున్నారు.