ఈ లోకంలో ఉండలేను: తన సమాధిని తానే కట్టుకున్నాడు, పోలీసుల జోక్యంతో. !
గుంటూరు: ఈ సమాజంపై విరక్తి పుట్టిన ఓ వృద్ధుడు తాను ఈ లోకంలో ఇక ఉండలేనంటూ తన సమాధిని తాను కట్టుకున్నాడు. అయితే, ఆయన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని మాచర్లలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన తాతిరెడ్డి లచ్చిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక విషయాల్లో తలమునకలైపోయాడు. కుటుంబానికి కూడా గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నాడు.
కాగా, టీవల ఆయన 'సమాజం నాకు నచ్చడం లేదు.. అందుకే దేవుడి దగ్గరకు వెళ్లేందుకు సజీవ సమాధి అవుతాను' అంటూ తన పొలంలో సమాధి కట్టించాడు. అందులోకి వెళ్లేందుకు జిల్లా కలెక్టర్, పోలీసుల అనుమతి కోరాడు. ఊర్లో వారికీ చెప్పాడు. దీనిలో భాగంగా గురువారం సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు.
అయితే, కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామీణ ఎస్ఐ లోకేశ్వరరావు.. సమాధి కావాలన్న తాతిరెడ్డి ప్రయత్నాలను అడ్డుకున్నారు. చట్టరీత్యా ఇలాంటి పనులు చేయకూడదంటూ నచ్చజెప్పారు. ఆయనకు పలు విషయాలపై అవగాహన కల్పించడంతో ఎట్టకేలకు తన యత్నాన్ని విరమించుకున్నాడు తాతిరెడ్డి.