అమరావతి బాండ్లపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ...ఆ పదం రికార్డ్స్ నుంచి తొలగించాలని టిడిపి ఎమ్మెల్యే
అమరావతి: అమరావతి బాండ్లపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అమరావతి బాండ్ల వ్యవహారం పారదర్శకంగా జరుగుతోందని...కానీ ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
దోమలపై దండయాత్ర ప్లాప్...వాటికి విచక్షణ ఉండదు:విష్ణుకుమార్ రాజు వ్యంగాస్త్రాలతో అసెంబ్లీలో నవ్వులు
కేంద్రం ఏమాత్రం సహకరించకున్నా ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. బిజెపి ప్రతి విషయాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తోందని నరేంద్ర ఆరోపించారు. ఈ సందర్భంగా సభలో బిజెపి, టిడిపి సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. దీంతో బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ చేసిన విమర్శల్లో ఒక పదం అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించాలంటూ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ స్పీకర్ ను కోరారు.
అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం..."రాజకీయ అవినీతి"కి పాల్పడుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో వాటిపై స్పందించిన ప్రభుత్వ విప్ కూన రవికుమార్...బిజెపి ఎమ్మెల్యే విష్ణు అలా వ్యాఖ్యానించడం సబబు కాదని హితవు పలికారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం, వారి ఆకాంక్షలు నెరవేర్చడంకోసం పనిచేస్తుందని అన్నారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన తర్వాత వారి సహకారం కోరడమనేది రాజకీయ పార్టీ పరంగా తమకు ఉన్నటువంటి హక్కు అని కూన చెప్పుకొచ్చారు. ఆ హక్కును తప్పుబడుతూ మీ బీజేపీ సభ్యులు ఈ సభలో మాట్లాడటం చాలా విచారకరమని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే విష్ణు వాడిన రాజకీయ అవినీతి అనే పదాన్ని అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించాలని ఆయన స్పీకర్ను ఆయన కోరారు.
కేంద్రంలో ఉన్న మీ బీజేపీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి ఏమాత్రం సహకరించకపోయినా...ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, చట్టంలో ఉన్నవి సైతం అమలు చేయకపోయినా...ఎన్ని ఇబ్బందులున్నా మొక్కవోని దీక్షతో పేదోడి ఇంటి కలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారని కూన రవికుమార్ వివరించారు. ఇంత అభివృద్ది, కృషి జరుగుతున్నప్పుడు మీరు అభినందించాల్సింది పోయి వంకలు పెట్టడం సరికాదని బీజేపీ సభ్యులకు ఆయన హితవు పలికారు.