తెలంగాణ హెచ్చరిక, ఏపీకి కాల్డేటా: ట్యాపింగ్పై సుప్రీంకు ఆపరేటర్లు
ఢిల్లీ/విజయవాడ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టెలికం ఆపరేటర్లు విజయవాడ న్యాయస్థానం తీర్పును సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బెజవాడ కోర్టు తీర్పును వాళ్లు బుధవారం నాడు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశముంది.
కాగా, ఓటుకు నోటు నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కొద్ది రోజుల క్రితం ఆసక్తికరమైన వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ పైన మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో గత శుక్రవారం వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా టెలికం సర్వీస్ ప్రొవైడర్ల తరఫు న్యాయవాదులు, ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్ హాజరయ్యారు. 174 సెక్షన్ ప్రకారం సర్వీస్ ప్రొవైడర్ల పైన చర్యలు తీసుకోవాలని ఏజీ (అడ్వోకేట్ జనరల్) న్యాయస్థానాన్ని కోరారు.
ఆ సమయంలో సర్వీస్ ప్రొవైడర్లు ఆసక్తికర వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ఇవ్వవద్దని మెమో ఫైల్ చేసిందని, డేటా ఇస్తే ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించిందని చెప్పారు. అందుకే కాల్ డేటా ఇవ్వలేమని సర్వీస్ ప్రొవైడర్లు కోర్టుకు చెప్పారు.
కేంద్రం కూడా సమాచారం ఇవ్వవద్దని ఆదేశించిందని లాయర్లు చెప్పారు. కేంద్రం ఉత్తర్వులు కోర్టును నిర్దేశించలేవని ప్రాసిక్యూషన్ వాదించింది. కాల్ డేటా రెండు నెలల తర్వాత డిలీట్ అవుతుందని అడ్వోకేట్ జనరల్ చెప్పారు. దీనిపై గతంలో సుప్రీం ఉత్తర్వులు ఇచ్చినట్లు గుర్తు చేశారు.
అయితే, ఈ నెల 24వ తేదీలోగా కాల్ డేటా ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లను విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. ఆ గడువు సమీపిస్తోంది. మరోవైపు, కాల్ డేటా ఇస్తే కేసులు పెడతామని తెలంగాణ ప్రభుత్వం బెదిరించింది. దీంతో ప్రొవైడర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.