అమరావతి అభివృద్ది ప్రణాళికలపై ఢిల్లీలో వర్క్షాపుల ఏర్పాటు:అధికారులకు సిఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి:నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్దిపై దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ స్థాయి వర్కుషాపులు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను వివరించాలని సిఆర్డిఎ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఈ విషయమై ఆదివారం సిఎం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్థేశం చేశారు. నవ నగరాల నిర్మాణంలో భాగంగా అమరావతి మీడియా సిటీపై ఇప్పటికే వర్కు షాపు నిర్వహించామని, మరో ఎనిమిది ప్రతిపాదిత నగరాలపైనా వర్కుషాపులు నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించాలని సిఎం అధికారులకు సూచించారు. అనంతరం పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో సిఎం చర్చించారు.
అమరావతిపై...దిశానిర్ధేశం
నవ నగరాలను విశిష్టత పాలన, ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధి కార్యకలాపాల కేంద్రాలుగా మార్చాలని సిఎం చంద్రబాబు అధికారులకు వివరించారు. వీటి నిర్మాణానికి సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ అంతర్జాతీయ నిపుణులను ఆహ్వానించాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబరులోగా అమరావతికి ఒక రూపు తీసుకొస్తే అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయని సిఎం చంద్రబాబు చెప్పారు.
2050 నాటికి...ఇదీ మన లక్ష్యం
2050 నాటికి 15 లక్షల ఉద్యోగాలను సృష్టించడం, 35 బిలియన్ డాలర్ల జిడిపిని చేరుకోవడమే మన లక్ష్యంగా నిర్ణయించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సిఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం సిఆర్డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ నవనగరాల ప్రణాళికల వివరాలను ముఖ్యమంత్రికి తెలిపారు.
ఎంపీలతో...వ్యూహంపై చర్చ
అనంతరం టీడీపీ ఎంపీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఎంపీల పోరాటంపైనే ఉందన్నారు. బీజేపీ నేతల మోసాన్ని, ద్రోహాన్ని నిలదీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలకు సూచించారు. ఏఏ అంవాలను ఎంపీలు పార్లమెంట్ లో ప్రస్తావించాలో తెలిపారు.
పార్లమెంట్...కాపు రిజర్వేషన్లు
ప్రత్యేక హోదా,విభజన హామీలతో పాటు కాపు రిజర్వేషన్ల అంశంపైనా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిఎం చంద్రబాబు సూచించారు. పార్లమెంట్లో హామీలిచ్చారని, ఇప్పుడు చేయలేమని అఫిడవిట్లు ఇస్తున్నారని అన్నారు. టిడిపిపై బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు.