జగన్ సర్కార్ కు కేంద్రం మరో షాక్- మాకు చెప్పి చేశారా ? లండన్ కోర్టులో ఇరికించిన వైనం
ఏపీలో అధికార వైసీపీతో ఓవైపు సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పైకి కనిపిస్తున్న కేంద్రంలోని ఎన్డీయే సర్కార్... కీలక అంశాల్లో మాత్రం తమ దారి తాము చూసుకుంటోంది. ఇప్పటికే పలు అంశాల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా జగన్ సాయం తీసుకుంటున్న కేంద్రం.. సమస్యలు ఎదురైనప్పుడు తమ వంతు సాయం చేసేందుకు మాత్రం ససేమిరా అంటోంది. దీంతో జగన్ సర్కార్ ఇరుకునపడుతోంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల్లో సాయానికి నిరాకరిస్తున్న కేంద్రం.. ఇప్పుడు అంతర్జాతీయ స్ధాయిలో సాగుతున్న ఓ మధ్యవర్తిత్వ డీల్ లో జగన్ సర్కార్ కు హ్యాండిచ్చేసినట్లే కనిపిస్తోంది.
కేంద్రంతో జగన్ సంబంధాలు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీతో సత్సంబంధాలు కొసాగిస్తున్న ఎన్డీయే సర్కార్ విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. సీఎం జగన్ పదే పదే వెళ్లి అడుగుతున్నా కేంద్రం నుంచి మాత్రం మొండి చేయి ఎదురవుతోంది. అయినా జగన్ మాత్రం తప్పనిసరి పరిస్ధితుల్లో ఇష్టం లేకపోయినా కేంద్రంతో సంబంధాలు కొనసాగించాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయి.
మరోవైపు ఎప్పటికప్పుడు కేంద్రమంత్రులు వైసీపీని ఎన్డీయేలో చేరాలని ఆహ్వానాలు కూడా పలుకుతున్నారు. దీంతో వైసీపీతో కేంద్రం చేస్తున్న రాజకీయం ఇప్పుడు ఎవరికీ అంతుబట్టడం లేదు.
జగన్ కు కేంద్రం మరోసారి హ్యాండ్
ఇప్పటికే రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలతో పాటు విభజన సందర్భఁగా ఇచ్చిన హామీల విషయంలోనూ జగన్ కు మొండి చేయి చూపిస్తున్న కేంద్రం.. తాజాగా మరో కీలక అంశంలోనూ హ్యాండిచ్చేసినట్లే కనిపిస్తోంది. ఇది రాష్ట్ర పరువు ప్రతిష్టల్ని అంతర్డాతీయ స్ధాయిలో మంటగలిపేలా ఉంది. ఇందుకు కేంద్రానికి వారి కారణాలు వారికున్నాయి.
కానీ రాష్ట్రం పరిస్ధితి అలా కాదు. కేంద్రం సాయం లేనిదే ఈ గండం నుంచి బయటపడేందుకు జగన్ సర్కార్ కు మార్గాలు కనిపించడం లేదు. దీంతో అటు కేంద్రాన్ని సాయం అడగలేక, అలాగని నేరుగా తాము ప్రయత్నించే పరిస్ధితి లేక జగన్ సర్కార్ కు చుక్కలు కనిపిస్తున్నాయి.
జగన్ మెడకు రాకియా డీల్
ఎప్పుడో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న బాక్సైట్ తవ్వకాల డీల్ ఇప్పుడు అటు ఇటు తిరిగి ఇప్పుడు జగన్ మెడకు చుట్టుకుంది. వైఎస్ హయాంలో బాక్సైట్ తవ్వకాలకు వీలుగా పెన్నా గ్రూప్, దుబాయ్ కు చెందిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్ మెంట్ అధారిటీ (రాకియా)తో డీల్ కుదిరింది. దీని ప్రకారం విశాఖ జిల్లా మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపట్టాలి.
ఈ తవ్వకాల ద్వారా లభించే బాక్సైట్ ఖనిజాన్ని రాకియాకు చెందిన అన్ రాక్ అల్యూమినియం సంస్ధకు ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంది. కానీ ప్రజాందోళనల కారణంగా అప్పటి వైఎస్ సర్కార్ తో పాటు ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ముందడుగు వేయలేని పరిస్ధితి. దీంతో ఇప్పటికీ రాకియా డీల్ అమలు కాలేదు. అంతే కాదు రాకియాతో ఏఫీ ప్రభుత్వం కుదుర్చుకున్న డీల్ కొనసాగుతుండగానే జగన్ సర్కార్ బాక్సైట్ మైనింగ్ లీజుల్ని రద్దు చేసేసింది. దీంతో రాకియా అంతర్జాతీయంగా న్యాయపోరాటానికి దిగింది.
కేంద్రం సాయం కోరిన జగన్
రాకియాతో కుదుర్చుకున్న బాక్సైట్ సరఫరా డీల్ ప్రకారం సరఫరా చేయాల్సిన ఖనిజం విశాఖ మన్యం నుంచి తీసుకునే వీలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి తమకు కేటాయింపులు చేయాలని కేంద్రాన్ని జగన్ సర్కార్ సాయం కోరింది. ముఖ్యంగా పొరుగున ఉన్న ఒడిశా మైనింగ్ కార్పోరేషన్ నుంచి అక్కడి గనుల ద్వారా లభిస్తున్న బాక్సైట్ ను తమకు వేలంతో సంబంధం లేకుండా కేటాయించాలని జగన్ సర్కార్ కోరింది.
అలా చేస్తే అన్ రాక్ కు గతంలో హామీ ఇచ్చిన బాక్సైట్ సరఫరా చేయొచ్చని ఏపీ సర్కార్ భావించింది. ఒడిశాలో కుదరకపోతే మరో రాష్ట్రం నుంచి అయినా బాక్సైట్ ఇప్పించాలని వేడుకుంది. దీనిపై కేంద్రం స్పందన జగన్ సర్కార్ కు షాకిచ్చింది.
జగన్ కు కేంద్రం షాక్
రాకియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సరఫరా చేయాల్సిన బాక్సైట్ ను ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పించాలన్న జగన్ సర్కార్ విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. ఆయా రాష్ట్రాల్లో బాక్సైట్ మైనింగ్ లీజుల వేలంలో పాల్గొని వాటిని దక్కించుకోవాలని సూచించింది. అలా కాకుండా నేరుగా బాక్సైట్ ను ఏపీ ప్రభుత్వానికి కేటాయించలేమని తేల్చిచెప్పేసింది. దీంతో జగన్ సర్కార్ ఇరుకునపడింది. మొదట ఒడిశాలో కుదరదని స్పష్టం చేసిన కేంద్రం.. ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లోనూ బాక్సైట్ నేరుగా ఇప్పించలేమని జగన్ సర్కార్ కు తేల్చిచెప్పేసింది. దీంతో చేసేది లేక రాకియా కోరుతున్న విధంగా పరిహారం చెల్లింపు కోసం మధ్యవర్తిత్వం నెరిపేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోంది.
Recommended Video
డీల్ మీది పరిహారం మాదా ? కేంద్రం మరో షాక్
రాకియాతో బాక్సైట్ సరఫరా డీల్ విఫలం కావడంతో ఆ సంస్ధ కోరుతున్న విధంగా పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే పరిహారం భారీగా ఉండటంతో కేంద్రం సాయం కోరింది. దీనికి కేంద్రం ససేమిరా అంటోంది. రాకియాతో ముందూ వెనుకా ఆలోచించకుండా ఒప్పందాలు చేసుకోవడం, వాటిని రద్దు చేసుకోవడం అంతా మీ ఇష్టమేనా అని జగన్ సర్కార్ ను ప్రశ్నిస్తోంది.
లీజుల రద్దు వ్యవహారంతో తమకు సంబంధం లేదని, రాష్ట్రమే పరిహారం చెల్లించి ఈ కేసు నుంచి బయటపడాలని కేంద్రం సూచిస్తోంది. ఈ మధ్యవర్తిత్వం తేల్చేందుకు లండన్ కోర్టుల్లో సాగుతున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా ఇబ్బందులు లేకుండా సాయం అందిస్తాం తప్ప పరిహారం మాత్రం చెల్లించబోమని కేంద్రం తేల్చిచెప్పేసింది. దీంతో జగన్ సర్కార్ ఇబ్బందులు రెట్టింపయ్యాయి.